గాయంతో ఆటకు దూరమైన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ శతకం సాధించాడు. ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో పరుగుల వరద పారించాడు. 107 బంతుల్లో సెంచరీని సాధించిన అతడు 159 పరుగుల వద్ద ఔటయ్యాడు. 18 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.
టాలెంట్కు కొదవలేని పృథ్వీ షా టీమిండియా స్టార్ బ్యాటర్ అవుతారని భావించారంతా. కానీ తన కెరీర్ను గొప్పగా తీర్చిదిద్దుకోలేక భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో పృథ్వీ పరుగుల వరద పారించాడు. నార్తంప్టన్షైర్ తరఫున శతకాల మోత మోగించాడు. ఓ డబుల్ సెంచరీతో పాటు విధ్వంసకర సెంచరీ బాదాడు. తిరిగి టీమిండియాలో చోటు సంపాదించుకునే తరుణంలో దురదృష్టం అతడిని వెంటాడింది. గాయపడి ఆటకు దూరమయ్యాడు.

ఆరు నెలలకుపైగా శ్రమించి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. తిరిగి రంజీట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఛత్తీస్గఢ్ మ్యాచ్ కంటే ముందు బెంగాల్ పోరులో ఆడాడు. 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మంచి ప్రారంభానికి దక్కించుకున్న అతడు భారీస్కోరును సాధించలేకపోయాడు. కానీ గత మ్యాచ్లోని పొరపాటును ఇవాళ సరిదిద్దుకున్నాడు.
కాగా, ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆటలో 75 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 280 పరుగులు చేసింది. భూపేన్ లాల్వానీ (95*)తో కలిసి పృథ్వీ షా జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. వీరిద్దరు తొలి వికెట్కు 244 పరుగులు జోడించారు. ప్రస్తుతం క్రీజులో భూపేన్తో పాటు భత్కల్ ఉన్నాడు.