
ముంబై: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి భుజం గాయంకు గురయ్యాడు. ఈ గాయం కారణంగా జనవరి చివరలో న్యూజిలాండ్లో జరిగే పర్యటనకు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ టూర్కు సన్నాహకంగా ఇండియా-ఏ జట్టు ఆడబోయే మ్యాచ్ల నుంచి భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) పృథ్వీ షాను తప్పించింది.
గాయం కారణంగా ఇప్పటికే ముంబై-కర్ణాటక మధ్య జరిగిన రంజీ మ్యాచ్ పృథ్వీ షా ఆడలేదు. తాజాగా షా భుజం గాయంతో బాధపడుతున్నట్లు ముంబై మేనేజర్ అజింక్య షా ఓ ప్రకటనలో తెలిపాడు. శనివారం షా కనీసం చేతిని పైకి ఎత్తలేకపోయాడని చెప్పుకొచ్చాడు. వైద్య బృందం షాకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. వీటిని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపగా.. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు షా కండరంలో పగుళ్లు ఉన్నట్లు తెలిపారు. దీంతో కివీస్ పర్యటన సమయానికి షా అందుబాటులో ఉండేది అనుమాణంగానే ఉంది.
పృథ్వీ షా గతేడాది టెస్టుల్లో టీమిండియా తరపున ఆడుతూ మంచి ఫామ్లో ఉన్నాడు. అదే సమయంలో గాయంకు గురయ్యాడు. కోలుకోగానే డోపింగ్కు పాల్పడినందుకు ఎనిమిది నెలల పాటు సస్పెన్షన్కు గురయ్యాడు. షా గాయపడిన సమయంలో ఓపెనర్గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై డబల్ సెంచరీ చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
మరోవైపు టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయిన రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. వరుస సెంచరీలతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మయాంక్-రాహుల్ జోడి అద్భుతంగా రాణిస్తోంది. ఇక శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ కూడా ఓపెనర్ అవకాశం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో షాకు మళ్లీ టీమిండియా తరపున ఆడే అవకాశం ఇప్పట్లో రావడం కష్టమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షాకు ఓపెనర్గా అవకాశం రాదు.