Prithvi Shaw: పృథ్వీషా.. ఒకప్పుడు టీమిండియా రైజింగ్ స్టార్గా పరిగణించబడ్డాడు. రాబోయే రోజుల్లో పృథ్వీషా భారత జట్టుకు కీలక బ్యాటర్ అవుతాడని.. భారత జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడని భావించారు. కానీ పేలవమైన ఫామ్, ఫిట్నెస్ పృథ్వీని వెనక్కి లాగేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. కానీ ఇప్పుడు మరో లీగ్ పృథ్వీ షాకు మద్దతు ఇచ్చింది. ఆ లీగ్ అతడిని ఏకంగా ఐకాన్ ప్లేయర్గా మార్చింది.
ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ తరహాలో ప్రతి రాష్ట్రం టీ20 లీగ్లను నిర్వహిస్తున్నాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. దీన్ని ముంబై టీ20 లీగ్ అని పిలుస్తారు. ఈ లీగ్ మూడో సీజన్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తర్వాత ప్రారంభమవుతుంది. పృథ్వీషా ఈ లీగ్ ఐకాన్ ప్లేయర్గా ఎంపికయ్యాడు.

ముంబై టీ20 లీగ్లో మొత్తం 8 మంది ఆటగాళ్లను ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఇందులో పృథ్వీషాతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అజింక్యా రహానే, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, తుషార్ దేశ్ పాండే పేర్లు ఉన్నాయి. ఈ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ తన కోసం ఒక ఐకాన్ ఆటగాడిని ఎంచుకుంటుంది. ఈ లీగ్ వేలం తేదీలను ముంబై క్రికెట్ అసోసియేషన్ త్వరలో ప్రకటించనుంది. ఈ లీగ్ ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది. ఇది మూడో సీజన్ కావడం గమనార్హం. లీగ్ చివరి సీజన్ కొవిడ్ కంటే ముందే జరిగింది.
పృథ్వీషా పైనే అందరి కళ్లు..
ఈ లీగ్లో చాలా మంది కళ్లు పృథ్వీషా పైనే ఉంటాయి. పృథ్వీషా టీమిండియాలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. ఈ లీగ్ పృథ్వీషాకు తన కెరీర్ ప్రారంభ రోజుల్లో కనిపించిన ప్రతిభ ఇంకా ఉందని నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది. పృథ్వీషాకు టీమిండియాలోకి తిరిగి రావాలంటే అంత సులభమేమీ కాదు. కానీ అతడికి ఇంకా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. కానీ పృథ్వీషా తిరిగి రావాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. అప్పుడే మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముంబై టీ20 లీగ్ మే 26 నుంచి జూన్ 8 వరకు వాంఖడే స్టేడియంలో నిర్వహించబడుతుంది.