
ముంబై: టీమిండియా యువ ఆటగాడు, టెస్టు ఓపెనర్ పృథ్వీషాపై ఎనిమిది నెలల నిషేధం విధించడం కఠిన శిక్ష. షా కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సిందని భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీషా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకం 'టెర్బుటలైన్' ఉన్నట్టు తేలింది.
డోపింగ్ పరీక్షలో విఫలమైన షాపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. షా 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. దీంతో అతడు నవంబర్ 15 వరకు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు. అయితే జలుబు చేసినప్పుడు దగ్గుమందు తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అనంతరం షా స్పష్టం చేసాడు.
ఈ నిషేధంపై వెంగ్సర్కార్ మాట్లాడుతూ... ' నిషేధం విషయంలో పృథ్వీషాకు కఠిన శిక్ష వేశారని అనుకుంటున్నా. అతడి కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సింది. కుర్రాళ్లకు రాష్ట్రస్థాయి, జాతీయ క్రికెట్ అకాడమీలో డోపింగ్ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాలి. మరోవైపు సహాయక సిబ్బందికి తెలియజేయాలి' అని వెంగ్సర్కార్ పేర్కొన్నారు.
'పేద కుటుంబం నుంచి వచ్చిన ఆటగాళ్లకు దగ్గు మందు, నిషేధిత ఉత్ప్రేరకాల మధ్య తేడా అంతగా తెలియదు. వారికి సరైన అవగాహన కల్పించాలి. ప్రస్తుతం కీలక మ్యాచులు జరుగుతున్నాయి. ఈ సమయంలో 8 నెలలకు బదులు 3 లేదా 4 నెలలు నిషేధం విధిస్తే బాగుండు. మిగతా ఆటగాళ్లకు ఈ నిషేధం ఒక హెచ్చరిక' అని వెంగ్సర్కార్ అన్నారు.