న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి వైఫల్యానికి తనను ఎలా నిందిస్తారని అతని ప్రేయసి, బాలీవుడ్ తార అనుష్క శర్మ ప్రశ్నించింది. విరాట్ వైఫల్యం తన వల్లే అనడం తొందరపాటని ఆమె పేర్కొంది. 'మైదానంలో విరాట్ ప్రదర్శనకు నన్ను ఎలా నిందిస్తారు? అతని ప్రదర్శనకు నన్ను తప్పుపట్టడం చాలా తొందరపాటు. క్రికెటర్లను పరిణతి చెందినవారిగా చూడండి' అని అనుష్క శర్మ స్పష్టం చేసింది.
విరాట్ కోహ్లీ తన ప్రొఫెషన్పై ప్రభావం చూపనప్పుడు, తాను అతని ప్రదర్శనపై ఎలా ప్రభావం చూపుతానని వెల్లడించింది. విరాట్ సామర్థ్యం మీద ఎందుకు సందేహం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. అతడు సాధించిన దాన్ని అతని క్రిడెట్గా గుర్తించండి అని తెలిపింది.
సుధీర్ను కాపాడిన సచిన్ లేఖ

ఆక్లాండ్: నిబంధనలను నిక్కచ్చిగా పాటించడంలో వారి తర్వాతే ఎవరైనా అని న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ అధికారులు మరోసారి నిరూపించుకున్నారు. గతంలో భారత క్రికెటర్ హర్భజన్ను ఇబ్బందులకు గురి చేసిన అధికారులు.. ఇప్పుడు టీమిండియా, సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ గౌతమ్పై పడ్డారు.
మనోడు ఎప్పటిలాగే ఒళ్లంతా పూసుకునేందుకు జెండా రంగులను చేత పట్టుకొని న్యూజిలాండ్లో దిగాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు.. ఏకంగా రూ.70వేల జరిమానా కట్టమన్నారు. ఏం చేయాలో పాలుపోని సుధీర్ తాను టీమిండియా వీరాభిమానినని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు
దీంతో చివరకు తనకు సచిన్ టెండూల్కర్ రాసిన లేఖను చూపించడంతో.. శాంతించిన అధికారులు అతడ్ని విడిచిపెట్టారు. మొత్తానికి సచిన్ లేఖతో సుధీర్ గౌతమ్ అధికారుల నుంచి తప్పించుకున్నాడు.
గతంలో హర్భజన్ సింగ్ కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. న్యూజిలాండ్ దేశానికి వచ్చేవారు తినుబండారాలు, ద్రవ పదార్థాల్లాంటివి తీసుకురాకూడదనే నిబంధనలున్నాయి. ఓసారి బురద అంటుకున్న బూట్లతో అక్కడికి వెళ్లి.. రూ.23వేల జరిమానా కూడా సమర్పించుకున్నాడు భారత స్పిన్నర్ హర్భజన్.