కరాచీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్... భారత్ - పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ ఉండాలని కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని షరీఫ్కు సన్నిహితుడు ఒకరు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నవాజ్ షరీఫ్ క్రికెట్కు పెద్ద అభిమాని. అలాంటి షరీఫ్ దాయాదులైన భారత్ - పాక్ జట్ల మధ్య సిరీస్ జరగాలని కోరుకుంటున్నారంటున్నారు.
భారత్ నుంచి సిరీస్ విషయమై సానుకూలత కనిపించడం లేదని సదరు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సన్నిహితుడు వ్యాఖ్యానించారని చెబుతున్నారు. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని షరీఫ్ తమ ఆటగాళ్ల భద్రత విషయమై ఆలోచిస్తున్నారని చెప్పారు.
ఇరు దేశాలకు చెందిన లక్షలాది క్రికెట్ అభిమానులు.. భారత్ - పాక్ మధ్య సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారని, అలాగే ప్రధాని షరీఫ్ కూడా ఎదురు చూస్తున్నారని, సిరీస్ జరగాలని ఇరు దేశాలకు చెందిన లక్షలాది మంది కోరుకుంటున్నట్లే, ఆయన కోరుకుంటున్నారని చెప్పారని తెలుస్తోంది.

భారత్తో సన్నిహితంగా ఉండాలని నవాజ్ షరీఫ్ కోరుకుంటున్నారని, అయినప్పటికీ క్రికెట్ ఓ ఆట మాత్రమేనని వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల మధ్య పొలిటికల్ ఉద్రిక్తతలు ఉన్నాయని, ఇలాంటివి ఎవరూ కోరుకోవడం లేదని షరీఫ్ సన్నిహితుడు వ్యాఖ్యానించారు. ఆటలను ఆటలుగానే తీసుకోవాలని, ఇరు దేశాల మధ్య క్రికెట్ సమస్య త్వరలో కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని సదరు షరీఫ్ సన్నిహితుడు ధీమా వ్యక్తం చేశాడంటున్నారు.
ఇదిలా ఉండగా, మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ మాత్రం భారత్తో పాక్ ఆడే విషయంలో విభేదిస్తున్నాడు. నిసార్ అలీ ఖాన్ మంగళవారం మాట్లాడుతూ... భారత్లో పాక్ పర్యటనను తాను వ్యతిరేకిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం శివసేన హెచ్చరికను సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు.
కాగా, భారత్ - పాక్లు 2008 ముంబై దాడుల అనంతరం ఓ సిరీస్ మొత్తం ఆడలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో... భారత్ - పాక్ సిరీస్ జరగాలంటే ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంది.
పిసిబి సభ్యుడు నజామ్ సేథి మాట్లాడుతూ... భారత్లో సిరీస్ ఆడేందుకు బిసిసిఐ నుంచి వచ్చే ప్రతిపాదనను అంగీకరించవద్దని తాను బోర్డుకు చెబుతానని చెప్పాడు. సిరీస్ కోసం తాము భారత్ వెళ్లేది లేదని, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్లోనే భారత్ ఆడాలన్నారు.
2015 నుంచి 2023 వరకు భారత్ - పాక్ మధ్య ఆరు సిరీస్లో జరగాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం సమయంలో నజామ్ సేథి బోర్డు చైర్మన్గా ఉన్నాడు. డిఫెన్స్ ఎనలిస్ట్ లెఫ్టినెంట్ జనరల్ తాలత్ మసూద్ (రిటైర్డ్) మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అతివాదులను వెనకేసుకు రావొద్దన్నారు.