సిడ్నీ: సెమీస్ వరకు ఎలాంటి కష్టం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాకు సెమీస్లో ఆస్ట్రేలియా రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం జరగనున్న సెమీస్ (ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా) మ్యాచుపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది.
అంతర్జాతీయ క్రికెట్లో బలమైన ప్రత్యర్థులైన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా, మైకేల్ క్లార్క్ నాయకత్వంలోని ఆస్ట్రేలియ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడే అవకాశం ఉంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ ఉంటుందో.. అంతే ఉత్కంఠ కూడా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచులోనూ ఉంటుంది. రెండు జట్లకూ ప్రత్యర్థి జట్టు నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది.

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మెన్ గ్లేన్ మాక్స్వెల్ మధ్య బంతి.. బ్యాట్ యుద్ధం జరిగే అవకాశం ఉంది. డేవిడ్ వార్నర్.. మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్పై దాడి చేస్తాడా లేక మైకేల్ క్లార్క్ అనుభవంతో రవీంద్ర జడేజాను ఎదుర్కొంటాడా? అనేది మ్యాచులోనే తేలాల్సి వుంది. మిచెల్ స్టార్క్ కూడా విరాట్ కోహ్లీ కోసం ఎదురుచూస్తున్నాడు.
టోర్నీ ప్రారంభంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో సెంచరీ మినహా మరో మ్యాచులో అర్థ శతకం బాదని విరాట్ కోహ్లీపైనే ప్రస్తుతం అందరి కళ్లున్నాయి. గురువారం జరగనున్న మ్యాచులో కోహ్లీ తన బ్యాటును ఝలిపించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా కోహ్లీకి ఉందనే చెప్పాలి.
సెమీస్లో హోరాహోరీ పోరు జరిగిన తర్వాత గెలిచిన జట్టు మార్చి 29న ఎంసిజిలో న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడుతుంది.

ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్కి ముందు ఒక్క గెలుపు లేదు
ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఒక్క మ్యాచులోనూ టీమిండియా విజయం సాధించలేదు. 4 టెస్టులు, ముక్కోణపు సిరీస్లో 2 వన్డేల్లోనూ టీమిండియా ఓటమి చవిచూసింది. ఇది కొంచెం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. అయితే టీమిండియా ప్రపంచ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచులోనూ ఓటమి ఎరగకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ఆస్ట్రేలియాకు పిచ్ ఆందోళన
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విభాగంలోనూ బలంగా ఉంది. మహ్మద్ షమీ 17 వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 14, మోహిత్ శర్మ 11 వికెట్లను పడగొట్టారు. ఏడు మ్యాచుల్లో 70 వికెట్లకు గానూ 42 వికెట్లను పడగొట్టారు. సిడ్నీలో జరిగే సెమీస్ ఆస్ట్రేలియాకు పరీక్షే కానుంది. తక్కువ, నెమ్మదైన పిచ్ ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి అనుకూలించే అవకాశం తక్కువే.
ఇప్పటివరకు భారత పేసర్లు రాణించినప్పటికీ.. సిడ్నీ మైదానం భారత స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు అనుకూలంగా ఉండనుంది. 12 వికెట్లు తీసిన అశ్విన్ తన దూస్రాలతో ఆస్ట్రేలియాను కట్టడి చేసే అవకాశం లేకపోలేదు. కాగా, ఆస్ట్రేలియాకు ప్రత్యేక స్పిన్నర్లు లేకపోవడం లోటనే చెప్పుకోవాలి.
స్టీవ్ స్మిత్ ముఖ్యమే
స్పిన్నర్లు ఎదుర్కొనడంలో మంచి అనుభవం ఉన్న స్టీవ్ స్మిత్ను తొందరగా పెవిలియన్ చేర్చాల్సిన బాధ్యత భారత బౌలర్లపైనే ఉంది. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టే బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వా తెలిపాడు. అయితే భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే ఉంది.
శిఖర్ ధావన్ అత్యధికంగా 367 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా మంచి ఫాంలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో 137 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన ట్రై సిరీస్లో భాగంగా ఎంసిజిలో ఆస్ట్రేలియాపై 138 పరుగులు చేశాడు రోహిత్.
ఆస్ట్రేలియాలో కూడా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మ్యాక్స్ వెల్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో కొంత సఫలం కావచ్చు. ఎందుకంటే ఐపిఎల్లో ఆడిన అనుభవం అతనికుంది. మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్లు కూడా చెలరేగే అవకాశం లేకపోలేదు. షేన్ వాట్సన్ ఫాంలోకి రావడం ఆసీస్కు మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్టార్క్ టోర్నమెంటులో 18 వికెట్లు తీశాడు.

మైకేల్ క్లార్క్ తన జట్టును ఫైనల్లోకి తీసుకెళ్తాడా లేక మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాను వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్లోకి తీసుకెళ్తాడా వేచిచూడాలి.
జట్లు:
ఇండియా: మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, మొహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ.
ఆస్ట్రేలియా: మైకేల్ క్లార్క్ (కెప్టెన్), జార్జ్ బెయిలీ, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫింఛ్, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, బ్రాడ్ హెడిన్(వికెట్ కీపర్), గ్లేన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్, జేమ్స్ ఫల్కూనర్, మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, జోష్ హజ్లివుడ్, ప్యాట్ కుమిన్స్, జేవియర్ దోహర్తీ.