హైదరాబాద్: టెస్టు సిరీస్ను 3-0తో గెలిచారు.. వన్డే సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడేమో భారత్తో ఏకైక టీ20 కోసం సిద్ధమైంది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో బుధవారం శ్రీలంక-భారత్ జట్ల మధ్య ఏకైక టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఫేవరేట్గా కనిపిస్తున్నా... కోహ్లీసేనను నిలువరించేందుకు సరికొత్త జట్టుతో శ్రీలంక బరిలోకి దిగనుంది.
శ్రీలంక పర్యటన తర్వాత కోహ్లీసేన స్వదేశంలో 9 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో రెండు మూడు మ్యాచ్ల సిరీస్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫార్మాట్లో జట్టు బ్యాటింగ్ లైనప్ను పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్ను వినియోగించుకోనుంది.
మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. భారత్తో జరిగిన 10 టి20ల్లో శ్రీలంక నాలుగు మ్యాచ్లు గెలిచి ఆరు ఓడింది. అయితే ఈ స్టేడియంలో శ్రీలంక ఆడిన మొత్తం 13 మ్యాచ్ల్లో కేవలం రెండు మాత్రమే నెగ్గడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది.

2019 వన్డే వరల్డ్కప్ కోసం ఇప్పటి నుంచే ప్రయోగాలు మొదలుపెట్టిన భారత జట్టు టీ20 కోసం ధావన్ స్థానంలో పంత్ను తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. గతంలో అతను ఇంగ్లాండ్, వెస్టిండీస్లతో టీ20 మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కేఎల్ రాహుల్, మనీష్ పాండే మిడిలార్డర్లో రానున్నారు. ఐదోవన్డేలో అర్ధసెంచరీ చేసిన కేదార్ జాదవ్కు మరో అవకాశం ఇవ్వనున్నారు. స్వదేశంలో వన్డేలు ఎక్కువగా ఉండటంతో అతన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. రహానే, శార్దుల్ బెంచీకే పరిమితం కానున్నారు.
ఐదో వన్డేకు దూరంగా ఉన్న పాండ్యా ఆల్రౌండర్గా తుదిజట్టులోకి రానున్నాడు. వన్డే సిరీస్లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన పేసర్ బుమ్రాతో పాటు భువనేశ్వర్ ఈ మ్యాచ్లోనూ కీలకం కానున్నారు. ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో కలిసి ఆడేందుకు కోహ్లీ ఆసక్తి చూపిస్తుండడంతో స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ప్రభావం చూపనున్నారు.

ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనతో ఉన్న లంక జట్టులో పలు మార్పులు చేసింది. వన్డే సిరీస్కు ముందు ప్రకటించిన జట్టులోకి కొత్తగా లెగ్ స్పిన్నర్ జె ఫ్రే వాండర్సే, సీమర్ షనకలను తీసుకుంది. రెండో టెస్టులో గాయపడ్డ లక్మల్, మిస్టరీ స్పిన్నర్ ధనంజయలకు చోటు కల్పించారు.
కానీ, ఆశ్చర్యకరంగా లెగ్ స్పిన్నర్ సందకన్, పేసర్లు ఫెర్నాండో, చమీరాను తప్పించారు. వన్డేలతో పాటు టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన ఉపుల్ తరంగపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. రెండు మ్యాచ్ల సస్పెన్షన్ తర్వాత ఐదో వన్డేలో ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు. బ్యాటింగ్లో డిక్వెల్లా, మునవీర, మాథ్యూస్, తరంగపైనే ఎక్కువ భారం పడనుంది.
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పాండే, రహానె, జాదవ్, ధోని, హర్దిక్ పాండ్య, అక్షర్పటేల్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, శార్దుల్ ఠాకుర్
శ్రీలంక: తరంగ (కెప్టెన్), మాథ్యూస్, డిక్వెలా, మునవీర, షనక, సిరివర్దన, హసరంగ డిసిల్వా, అఖిల ధనంజయ, వాండర్సె, ఉదాన, ప్రసన్న, తిసార పెరీరా, మలింగ, లక్మల్, వికుమ్ సంజయ
మ్యాచ్ ప్రారంభం:
సాయంత్రం 6.30 నుంచి సోని సిక్స్, టెన్ 3లో