
కోహ్లీసేనపై కివీస్ మెరుగైన రికార్డు
వరల్డ్ టీ 20ల్లో భాగంగా గతేడాది న్యూజిలాండ్తో ఆడిన ఆఖరి మ్యాచ్లో కూడా కోహ్లీసేన ఓటమి పాలైంది. దీంతో ఫిరోజ్ షా కోట్లాలో తొలి మ్యాచ్ గెలిచి ఖాతా తెరవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న ఫిరోజ్ షా కోట్లాలో ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ టీ20లు మాత్రమే జరిగాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లండ్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్ జరిగింది. ఆ వరల్డ్ కప్లో మూడు గ్రూప్ మ్యాచ్లతో పాటు ఒక సెమీస్ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. కాగా, బుధవారం న్యూజిలాండ్తో జరగనున్న టీ20నే భారత్కు తొలి టీ20 కావడం విశేషం.

ప్రత్యేక ఆకర్షణగా ఆశిష్ నెహ్రా
ఇదిలా ఉంటే కివీస్తో జరిగే తొలి టీ20 మ్యాచ్లో భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా తన సొంత మైదానంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడు. దీంతో తుది జట్టులో నెహ్రాకి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్తో టీ20 సిరీస్లో ఎంపికైన నెహ్రాకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఒకసారి జట్టులో ఎంపికైన తర్వాత అలా రిజర్వ్ బెంచ్లో కూర్చోవడం నెహ్రా కెరీర్లో తొలిసారి. దీంతో తన కెరీర్కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని నెహ్రా భావించాడు. దీంతో ఆసీస్తో టీ20 సిరిస్ జరిగే సమయంలోనే వీడ్కోలు చెప్పనున్నట్లు నెహ్రా ప్రకటించాడు.

టీ20 ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ అగ్రస్థానం
మరోవైపు టీమిండియాలో విరాట్ కోహ్లీ, ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక, ఆల్ రౌండర్ పాండ్యా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. దినేశ్ కార్తీక్ కూడా ఫామ్లోకి వచ్చాడు. మనీశ్ పాండే, కేఎల్ రాహుల్ తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు. ఇక భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాలతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. కుల్దీప్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్లలో ఎవరో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్కు భారత్పై మెరుగైన రికార్డు ఉంది.

టీ20ల్లో అద్భుతమైన ఫామ్లో కివీస్
గతేడాది ఆ జట్టు 10 టీ20లు ఆడగా అందులో 8 గెలిచింది. ఈ ఏడాదిలో ఆడిన నాలుగింటిలో మూడు గెలిచింది. ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లో కూడా కోహ్లీసేనకు గట్టిపోటీనిచ్చిన సంగతి తెలిసిందే. కివీస్ ఓపెనర్లు గుప్టిల్, మన్రో ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ విలియమ్సన్ మూడో వన్డేలో తిరిగి పుంజుకున్నాడు. మిడిలార్డర్లో అద్భుతంగా రాణించిన రాస్ టేలర్, టామ్ లాథమ్ ఆ జట్టుకు అదనపు బలం. ఇక, గ్రాండ్హోమ్ ఆల్ రౌండర్గా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఇక, బౌలర్ల విషయానికి వస్తే బౌల్ట్, శాంట్నర్, ఇష్ సోది, టిమ్ సౌథీ చక్కగా రాణిస్తున్నారు.

జట్లు వివరాలు
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్, మహేంద్రసింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, కొలిన్ డి గ్రాండ్హోమ్, మార్టిన్ గప్తిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లేథమ్, హెన్రీ నికోల్స్, ఆడమ్ మిల్నే, కొలిన్ మన్రో, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.


Click it and Unblock the Notifications











