ఏబీ దూరం: లయన్స్తో మ్యాచ్, కోహ్లీ ఏం చేస్తాడో? (ఫోటోలు)
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా మంగళవారం రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్లో మాత్రమే విజయం సాధించాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్లు ఆడగా మూడింటిలో.. బెంగళూరు ఐదు మ్యాచ్లు ఆడగా నాలుగింటిలో పరాజయం పాలయ్యాయి.
దీంతో మంగళవారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. తొలిరెండు మ్యాచ్ల్లో బౌలింగ్లో విఫలమైంది. ఆ తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి చేరినా ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

భారీ స్కోరు
కాగా, చివరగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బ్యాట్స్మెన్ రాణించడంతో భారీ స్కోరును నమోదు చేసింది. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఆరు వికెట్లతో ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో అండ్రూ టై అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనే ఏడు వికెట్లు తీశాడు.

రవీంద్ర జడేజా విఫలం
ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరోవైపు స్పిన్నర్లు షాదాబ్ జకాతి, శివిల్ కౌశిక్ కూడా విఫలమవుతుండటంతో గుజరాత్ వరుసగా పరాజయం పాలైంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సురేశ్ రైనా, బ్రెండన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తిక్, డ్వేన్ స్మిత్లతో పటిష్టంగా కన్పిస్తోంది.

బెంగళూరు ఆటగాళ్లను వేధిస్తోన్న గాయాలు
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. గాయం నుంచి కోలుకుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చినా బెంగళూరు రాత మాత్రం మారలేదు. చివరగా బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో తక్కువ లక్ష్యాన్ని సైతం చేధించలేక పోయింది.

బౌలింగ్ ఓకే
ఓపెనర్ క్రిస్ గేల్ వరుసగా విఫలమవుతుండడంతో జట్టులో చోటు కోల్పోయాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ లాంటి విధ్వంసర బ్యాట్స్మన్ ఉన్నా బెంగళూరు రాత మాత్రం మారడం లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే తైమాల్ మిల్స్, బిల్లీ స్టాన్లకే, యజ్వేంద్ర చహల్, శ్రీనాథ్ అరవింద్, శామ్యూల్ బద్రీలు ఆకట్టుకుంటున్నారు.

మంగళవారం నాటి మ్యాచ్కి ఏబీ దూరం
ఇదిలా ఉంటే గాయం కారణంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ సందేశాన్ని పోస్టు చేశాడు. మంగళవారం వాటి మ్యాచ్కు తాను అందుబాటులో ఉండటం లేదని అందులో పేర్కొన్నాడు. 'గాయం కారణంగా ఈరోజు జరిగే మ్యాచ్కి అందుబాటులో ఉండటం లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు గుడ్ లక్' అంటూ ఏబీ ట్విట్టర్ పేజిలో రాసుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications