
లంకతో భారత్కు ఎక్కడా పోలిక లేదు
నిజానికి లంకతో భారత్కు ఎక్కడా పోలిక లేదు. బ్యాటింగ్, బౌలింగ్లో టీమ్ఇండియా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంది. అయితే పాక్పై ఇచ్చిన గెలుపుతో లంకేయులను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.
అయితే టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడిన తొలిమ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో రాణించింది. తొలుత బ్యాటింగ్లో భారీ స్కోరు సాధించిన కోహ్లిసేన.. అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో 124 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది.

పటిష్టమైన బ్యాటింగ్ లైనప్
బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ మిస్ అయినా టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా తనవంతు బాధ్యతను నెరవేర్చాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్కూడా రాణించాడు. రోహిత్తో కలిసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. తొలివికెట్కు 136 పరుగులు జోడించారు. బ్యాటింగ్లో రోహిత్ ఘనమైన పునరాగమనానికి తోడు ధవన్ సానుకూలంగా ఆడటం విరాట్సేనకు బాగా కలిసొస్తున్న అంశం. ఈ మ్యాచ్లోనూ దీన్ని కొనసాగిస్తే తిరుగుండదు.

లంకకు కోహ్లీ భయం
లంక పేస్ బలగానికి ఇప్పటికే కోహ్లీ భయం పట్టుకుంది. పాకిస్థాన్పై అజేయ అర్ధసెంచరీతో ఆ మ్యాచ్లో అదరగొట్టిన కోహ్లీ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు తన కెరీర్లో ఆరో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న యువరాజ్ ఓవల్ పిచ్ మీద మెరుపులు మెరిపించాలని అనుకుంటున్నాడు. ఇక ధోని స్థానంలో బ్యాటింగ్కు దిగిన హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్తో పాక్కు భారత్ ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించగలింది. మరోవైపు పేపర్పై చూస్తే టైటిల్ ఫేవరెట్ భారత్కు లంక ఏమాత్రం పోటీనిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఈ మ్యాచ్లో నెగ్గి రెండు వరుస విజయాలతో సెమీస్లోకి అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది.

పటిష్టమైన బౌలింగ్లైనప్ ఉన్న జట్లలో భారత్ ఒకటి
ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ టోర్నీలో అత్యంత పటిష్టమైన బౌలింగ్లైనప్ ఉన్న జట్లలో భారత్ ఒకటి. పేసర్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ,హార్దిక్ ఆకట్టుకుంటుండగా.. స్పిన్నర్ రవీంద్ర జడేజా రాణించాడు. అయితే పాక్తో మ్యాచ్లో కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఈ మ్యాచ్లో అశ్విన్ ఆడడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు పేసర్ మహ్మద్ షమీని కూడా తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో లంక పోరు నామమాత్రమే
2015 వన్డే ప్రపంచకప్ తర్వాత దిగ్గజాలు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకోవడంతో ఆ స్ధాయి ఆటగాళ్లు ఆ జట్టుని ఇంకా భర్తీ చేయలేదు. దీంతో ఈ టోర్నీలో లంక పోరు నామమాత్రంగానే ఉండనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో 96 పరుగులతో చిత్తుగా ఓడింది. దీంతో నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా విజయం సాధించాల్సిందే. అయితే ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే ఏ ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన కెప్టెన్ మాథ్యూస్ పూర్తిగా కోలుకున్నాడు.

ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్ల నిషేధం
మరోవైపు ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్ల నిషేధం పడటం లంకకు కోలుకోలేని దెబ్బ. ఇతని స్థానంలో కుశాల్ పెరీరాకు అవకాశం దక్కనుంది. దినేశ్ చండిమల్, కపుగెడెరాపై భారీ ఆశలు పెట్టుకున్నా ఈ రోజు వరకు వాళ్ల పూర్తి సత్తా బయటపడలేదు. మిడిలార్డర్లో అనుభవలేమీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. మరోవైపు బౌలింగ్ భారమంతా స్టార్ పేసర్ లసిత్ మలింగపైనే ఉంది. అయితే గతమ్యాచ్లో మలింగ తేలిపోయాడు. సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, ప్రసన్న గత మ్యాచ్లో ఫర్వాలేదపించారు. కాగా, భారత్తో జరిగే మ్యాచ్లో దూకుడు చూపించాల్సిందేనని మాజీ క్రికెటర్ సంగక్కర.. యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదువలేనప్పటికీ.. సమష్టిగా ఆడడంలో జట్టు విఫలమవుతోంది.

మ్యాచ్కు వరుణుడి అడ్డంకి
ఛాంపియన్స్ ట్రోఫీని వరుణుడు వీడడం లేదు. ఇప్పటికే రెండు మ్యాచ్లు వర్షం ధాటికి రద్ద అయిన సంగతి తెలిసిందే. గురువారం జరిగే ఈ మ్యాచ్కు కూడా వాన ముప్పు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.

జట్లు (అంచనా):
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, ధోని, కేదార్/అశ్విన్, హార్దిక్, జడేజా, భువనేశ్వర్, ఉమేశ్, బుమ్రా/షమీ.
లంక: డిక్వెల్లా, చండిమల్, కపుగెడెరా, మెండిస్, పెరీరా, గుణరత్నే, తిసార/మాథ్యూస్, ప్రసన్న, ప్రదీప్, లక్మల్, మలింగా.


Click it and Unblock the Notifications