హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో వరుసగా వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా సిరీస్ను ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగే మూడో వన్డేలో కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది.
మూడో వన్డేతో సిరిస్ను చేజిక్కించుకుని మిగతా రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. టెస్టు సిరీస్ను చేజార్చుకుని ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ఆతిథ్య శ్రీలంక జట్టు.. వన్డే సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలువాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో మూడో వన్డేలో భారత్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక శ్రీలంక కెప్టెన్ తరంగ, ఓపెనర్ గుణతిలక సేవలు కోల్పోయింది. గుణతిలకకు గాయం కాగా, స్లో ఓవర్రేట్ కారణంగా కెప్టెన్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు వేయడం ఆతిథ్య జట్టును దెబ్బతీసింది.
ఈ మ్యాచ్ కోసం రెండో వన్డేలో ఆడిన జట్టును యథావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో రహానే, ఠాకూర్, కుల్దీప్, మనీష్ పాండే రిజర్వ్ బెంచ్కే పరిమితంకానున్నారు. బ్యాటింగ్ లైనప్లో ప్రయోగాలు చేయాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్లో నెగ్గితే తర్వాతి రెండు వన్డేల్లో స్వేచ్ఛగా ప్రయోగాలు చేసుకునే వీలుంటుంది. గత మ్యాచ్లో నిరాశపర్చిన లోకేశ్ రాహుల్, కేదార్ జాదవ్కు టాప్లో మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వనున్నారు. ధావన్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తుండగా, రోహిత్ శర్మ విజృంభించే అవకాశం ఉంది.
ఇక, తుది జట్టు విషయానికొస్తే మోకాలి గాయంతో గత మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన హార్దిక్ పాండ్యా ఆడేది అనుమానంగా మారింది. గాయం చిన్నదే అని, అతను ఫిట్నెస్తో ఉన్నాడని మేనేజ్మెంట్ చెబుతోంది. బౌలింగ్లో భువీ, బుమ్రా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. పాండ్యాని ఆడించి రిస్క్ తీసుకోకూడదని భావిస్తే మాత్రం కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
రెండో వన్డేలో భారత్కు గట్టి పోటీ ఇవ్వడం లంక జట్టులో ఆత్మవిశ్వాసం నింపేదే. తక్కువ స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో ధనంజయ అసాధారణ స్పెల్ మ్యాచ్ ని మలుపు తిప్పింది. లంక గనుక అదే ఊపు కొనసాగించి ఉంటే ఫలితం వారికి అనుకూలంగా వచ్చి ఉండేది. అయితే ఓడినప్పటికీ... గట్టి పోటీ ఇచ్చామన్న సంతృప్తితో ఈ మ్యాచ్కు సిద్ధమైంది.

అయితే అంతలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయం కావడంతో ఓపెనర్ గుణతిలక కనీసం పది రోజులు ఆటకు దూరమయ్యాడు. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్ల సస్పెన్షన్ పడింది. తరంగ స్థానంలో కపుగెడెర తాతాల్కికంగా సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తరంగపై వేటు, గాయంతో బాధపడుతున్న గుణతిలక స్థానంలో టెస్టు కెప్టెన్ చండిమల్, తిరిమన్నేను జట్టులోకి తీసుకున్నారు. లాహిరు తిరిమన్నె.. మరో ఓపెనర్ నిరోషన్ డిక్వెలాతో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో మాజీ కెప్టెన్ మాథ్యూస్ నుంచి లంక భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
మొత్తంగా చూస్తే ఒకటి, రెండు మార్పులతో లంక ఈ మ్యాచ్కు సిద్ధమవుతున్నది. ఇక, రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ధనంజయపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. భిన్నమైన ఆఫ్బ్రేక్ బంతులను సంధించే ఇతనిపై భారత్ దృష్టిసారించింది. కానీ, సీనియర్ పేసర్ మలింగతో పాటు మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.
జట్లు అంచనా:
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాహుల్, జాదవ్, ధోనీ, హార్దిక్, అక్షర్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా.
శ్రీలంక: కపుగెడెర (కెప్టెన్), డిక్వెల్లా, తిరిమన్నే, మెండిస్, చండిమల్, మాథ్యూస్, సిరివర్ధన, ధనంజయ, చమీరా, ఫెర్నాండో, మలింగ.