
న్యూఢిల్లీ: నేడు భారత జాతీయ క్రీడా దినోత్సవం. ప్రతీయేటా హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్చంద్ జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1905 ఆగస్టు 29న ధ్యాన్చంద్ జన్మించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లకు అవార్డులు అందజేశారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గకపోవడంతో ఈసారి వర్చువల్ విధానం ద్వారా క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.
ఈ పురస్కారాల కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు (విజ్ఞాన్ భవన్ నుంచి ) తదితరులు హాజరయ్యారు. అవార్డు విన్నర్లను రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో దేశంలోని తొమ్మిది వేర్వేరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల నుంచి వర్చువల్గా అనుసంధానించారు.
ఈ కార్యక్రమానికి అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్రత్న విజేతలు రాణీ రాంపాల్ (హాకీ), మనికా బాత్రా (టీటీ), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్) హాజరయ్యారు. కరోనా వైరస్ సోకడంతో వినేశ్ ఫొగట్ (రెజ్లింగ్).. ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లడంతో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అవార్డులను అందుకోలేకపోయారు. ఇక భారత సీనియర్ ఫాస్ట్బౌలర్ ఇషాంత్ శర్మ (అర్జున విన్నర్) కూడా ఐపీఎల్ కారణంగా హాజరుకాలేదు.
ఇతర రంగాల వారితో సమానంగా క్రీడాకారులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో కేంద్రం జాతీయ క్రీడా అవార్డుల కింద ఇచ్చే ప్రైజ్ మనీని భారీగా పెంచింది. జాతీయ క్రీడా అవార్డులకు చెందిన మొత్తం ఏడు కేటగిరీల్లో నాలుగింటికి ఈ పెంపు వర్తించనుంది. ఈ మేరకు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజూ శనివారం నాడు ప్రకటించారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పొందిన వారు ఇకపై రూ. 25 లక్షలు పొందనున్నారు. గతంలో ఈ రివార్డు కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే ఉండేది. అదే విధంగా అర్జున్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీని 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెరిగింది. ద్రోణాచార్య అవార్డు(జీవితకాలం)ప్రైజ్మనీ రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు, ద్రోణాచార్యఅవార్డు(రెగ్యులర్) కింద అందే మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగింది. ధ్యాన్ చంద్ అవార్డు కింద ఇచ్చే మొత్తం కూడా రెట్టింపై రూ. 10 లక్షలకు చేరుకుంది.