ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయం తర్వాత మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా మధ్య జరిగిన ఓ ఆత్మీయ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అర్ష్దీప్ సింగ్ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో వచ్చిన ప్రీతి జింటా.. తన జట్టు ఆటగాళ్లను అభినందిస్తూ ఉత్సాహపరిచారు. ఈక్రమంలో అర్ష్దీప్ సింగ్ను చూసిన ప్రీతి.. తన సంతోషాన్ని ఆపుకోలేక అతడిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఈ తరుణంలో అర్ష్ దీప్ సింగ్ ఎగిరి గంతేయడంతో అక్కడ ఉన్న జట్టు సభ్యులతో పాటు ప్రీతి జింటా కూడా ఆశ్చర్యపోయింది. అర్ష్దీప్ కూడా తన యజమాని అభినందనలకు ఎంతో ఉత్సాహంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధం, గౌరవం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సంబరాలు చేసుకున్న జట్టు సభ్యులు
ముఖ్యంగా ఈ వీడియోలో పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులందరూ కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తోంది. అర్ష్దీప్ సింగ్ తనదైన శైలిలో చిందులు వేస్తూ, చేతులెత్తి గెలుపు కేకలు వేస్తూ కెమెరాకు చిక్కాడు. పంజాబ్ జట్టు యాజమాన్యం, ఆటగాళ్ల మధ్య ఉన్న ఈ స్నేహపూర్వక వాతావరణమే వారి విజయాల రహస్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్.. ఇదే ఊపుతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రీతి జింటా తన జట్టుకు అందించే నైతిక మద్దతు, ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని ఈ వైరల్ వీడియో ద్వారా మరోసారి స్పష్టమైంది.