Preity Zinta: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IP) 2025 వారం పాటు నిలిపివేయబడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ నిలిపివేయబడింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో ఉన్న అభిమానులను శాంతియుతంగా వెళ్లిపోవాలని కోరినట్లు కనిపించింది. దీనికి సంబంధించి ప్రీతి జింటా ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ను షేర్ చేసింది.
గత కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళ పరిస్థితుల తర్వాత తాను ఎట్టకేలకు ఇంటికి తిరిగి వచ్చానని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది. అభిమానులకు ప్రీతి జింటా కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ ఖాతాలో ప్రీతి జింటా ఇలా రాసుకొచ్చారు. 'ధర్మశాల స్టేడియంలో ఉన్న అభిమానులు భయపడనందుకు, తొక్కిసలాటను సృష్టించనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను కొంచెం దురుసుగా ప్రవర్తించి అందరితో ఫోటోలు దిగడానికి నిరాకరించినందుకు క్షమించండి. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరినీ సురక్షితంగా చూసుకోవడం నా విధి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని ప్రీతి జింటా పోస్ట్లో రాశారు.

ఢిల్లీ- పంజాబ్ మ్యాచ్ కోసం నిండిపోయిన స్టేడియం
ధర్మశాల స్టేడియం దాదాపు 23 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గురువారం స్టేడియం ఖాళీ చేయబడినప్పుడు అది దాదాపు 80 శాతం నిండి ఉంది. భారత్ , పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ కారణంగా ఐపీఎల్ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. ఆ సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని కొనసాగించడం సముచితం కాదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని ధర్మశాల నుంచి తరలించి భారీ భద్రత మధ్య హోషియార్పూర్ మీదుగా జలంధర్ రైల్వే స్టేషన్కు తరలించారు. ఈ టీమ్లు శుక్రవారం రాత్రి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీ చేరుకున్నాయి. పాకిస్థాన్ దాడులను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ధర్మశాలలోని ఏకైక విమానాశ్రయం, పొరుగున ఉన్న కాంగ్రా, చండీగఢ్ విమానాశ్రయాలను మూసివేశారు.
రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ప్రీతి జింటా
ప్రీతి జింటా తన పోస్ట్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఐసీసీ అధ్యక్షుడు జైషా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్లకు తమ మద్దతు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.