
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పంజాబ్ జట్టు మొహాలీ వేదికగా తలపడిన మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయాన్ని వరించింది. చివరి నిమిషం వరకూ ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్లో ధోనీ వీరోచిత పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మ్యాచ్ చివర్లో ఉండగా బౌండరీలతో చెలరేగిన ధోనీ కేవలం 44 బంతుల్లో 79పరుగులు చేశాడు. అప్పటికీ లక్ష్యం 4పరుగుల దూరంలో ఉండటంతో చెన్నై జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఆ విజయాన్ని ప్రీతి జింతా మైదానంలో కలియతిరుగుతూ.. హెచ్చు స్థాయిలోనే సెలబ్రేట్ చేసుకుంది. ఇందులో భాగంగా స్టేడియంలోని అభిమానులకు టీ-షర్ట్ లు కూడా పంచి పెట్టింది. ఇలా పంచి పెడుతుండగా మధ్యలో ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ యథావిధిగా తన పని చేసుకుని పోయింది. అలా జరిగినందుకు కారణమేంటో అంటూనే పలు మీడియా ఛానెళ్లు ఆమెపై సందేహం వ్యక్తం చేశాయి.
దీనిపై ప్రీతి జింతా వివరణ ఇచ్చింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా పేర్కొంది. 'స్టేడియంలో టీ షర్టులు పంచే సమయంలో పెద్ద గుంపు ఇద్దరు చిన్నారులకు గాలి ఆడకుండా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అది చూసి ఏడుస్తున్న వాళ్లకు కాస్త గ్యాప్ ఇవ్వండి. కనీసం గాలి అయినా పీల్చుకునేందుకు అవకాశం ఇవ్వండి' అని పేర్కొంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 మ్యాచ్లు ఆడింది. ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపొంది కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో ప్రస్తుతం లీగ్ పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా, పంజాబ్ జట్టు తర్వాతి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 21న ఆడనుంది.