
ఢిల్లీ: ఐపీఎల్-13వ సీజన్ కోసం ఈనెల 19న కోల్కతాలో ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) పాల్గొనగా.. కోల్కతా నైట్రైడర్స్ ప్రాంచైజీ అతడి ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అతి పెద్దవయస్సు క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. కోల్కతాకు ఆడేందుకు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నట్టు తాంబే వేలం తర్వాత చెప్పాడు.
అయితే ఐపీఎల్-13లో ప్రవీణ్ తాంబే పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్టే కనబడుతోంది. గత నవంబరులో అబుదాబి టీ10 లీగ్లో ప్రవీణ్ ఆడడమే అందుకు కారణం. టీ10 లీగ్లో ప్రవీణ్ నార్తర్న్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డులోని క్రికెటర్ భారత్ బయట జరిగే ఫ్రాంచైజీ లీగ్లలో పాల్గొనకూడదు. దీనిప్రకారం చూస్తే.. తాంబే బోర్డు నిబంధనల్ని ఉల్లఘించినట్టే లెక్క. మరి ప్రవీణ్ తాంబే ఆడుతాడో లేదో చూడాలి.
48 ఏళ్ల తాంబే క్రికెట్పై ఉన్న ఇష్టంతో ఇంకా ఆడుతున్నాడు. ఐపీఎల్లో ప్రవీణ్ తాంబే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసాడు. అప్పుడు రాజస్థాన్ కనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్లో సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాంబేతో పాటు వార్తల్లో నిలిచిన 14 ఏళ్ల నూర్ అహ్మద్ వేలంలో అమ్ముడుపోయాడు.
ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు ఆసీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. అన్ని ఫ్రాంచైజీలు వీదేశీ ఆటగాళ్లపై రూ.140.30 కోట్లు ఖర్చు చేయగా.. ఆసీస్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. 13 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.58.25 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఆసీస్ ఆటగాళ్లకు ఎంత డిమాండ్ ఉందో. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ను రూ. 15.50 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ విదేశీ ఆటగాడిపై పెట్టనంత భారీ మొత్తాన్ని కేకేఆర్ వెచ్చించింది. ఇంతకుముందు బెన్ స్టోక్స్ 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది.