
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఎంపికయ్యారు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు ఆమ్రే సహాయ కోచ్గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్ హెడ్గా పనిచేసిన 52 ఏళ్ల ఆమ్రే.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో చేరనున్నాడు. భారత్ తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.
'మరోసారి అవకాశం ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. 2020లో ఢిల్లీ ఫైనల్కు చేరుకుంది. ఇలాంటి సంతోషకర పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడికి రావడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. రికీ పాంటింగ్, ఇతర సిబ్బంది, ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని ప్రవీణ్ ఆమ్రే తెలిపారు. భారత్ తరఫున ఆడిన ఆమ్రె.. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా, కోచ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ముంబైకి కోచ్గా మూడు రంజీ ట్రోఫీలు అందించారు. టీమిండియాలో కొందరు క్రికెటర్లకు ఆయన వ్యక్తిగత కోచ్గా ఉన్నారు.
ప్రవీణ్ ఆమ్రేకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సీఈవో ధీరజ్ మల్హోత్రా స్వాగతం పలికారు. 'మా జట్టులో కీలక ఆటగాళ్లంతా భారతీయులే. మా కోచింగ్ బృందానికి సంబంధించి ఇదే ఆలోచనా ప్రక్రియ అనుసరిస్తాం. ప్రవీణ్ ఆమ్రెలా దేశవాళీ క్రికెట్ గురించి బాగా తెలిసిన కోచ్లు కొందరే ఉన్నారు. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, పృథ్వీ షా బాగా ఆడటంలో ఆయన కీలకమవుతారు. ఆయన అనుభవం మాకెంతో విలువైంది. ఆయన ఫ్రాంచైజీలో చేరినందుకు ఆనందంగా ఉంది' అని ధీరజ్ పేర్కొన్నారు.
ప్రవీణ్ ఆమ్రే భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై కూడా స్పందిస్తుంటాడు. రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరును అజింక్య రహానే వ్యక్తిగతంగా అధ్యయనం చేసుంటాడని అతడి కోచ్ ఆమ్రె ఇటీవల అన్నారు. మ్యాచ్ తొలి రోజే ఆర్ అశ్విన్ను ప్రయోగించడం తెలివైన ఎత్తుగడని ప్రశంసించారు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ రనౌట్కు కారుకుడై, తక్కువ పరుగులే చేసిన జింక్స్ తర్వాతి టెస్టుకు సారథ్యం వహిస్తుండటంతో కాస్త భయం వేసిందన్నారు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టులో పుంజుకొనేందుకు ఆసీస్ విశ్వప్రయత్నం చేస్తుందని అంచనా వేశారు.