Pratika Rawal: మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయడంతో పాటు ప్లేయర్లకు కూడా విజేత పతకాలను అందజేశారు. కానీ ఓ కీలక క్రీడాకారిణికి మాత్రం పతకం దక్కలేదు. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. యువ బ్యాటర్ ప్రతీక రావల్కు మాత్రం మెడల్ దక్కలేదు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందం, మెడల్ దక్కలేదన్న బాధ ఆమెలో స్పష్టంగా కనిపించాయి.
ప్రతీక రావల్ అంకితభావం, ఆమె చేసిన పరుగులు భారతదేశానికి టైటిల్ను అందించడంలో ఎంతగానో తోడ్పడ్డాయి. జట్టులో రెండో అత్యధిక రన్-స్కోరర్గా నిలిచినప్పటికీ, ఐసీసీ (ICC) నిబంధనల కారణంగా ఆమె పతకాన్ని అందుకోలేకపోయింది. ప్రపంచ కప్లో టీమిండియా తరఫున ఓపెనర్ ప్రతీక రావల్ రెండో అత్యధిక పరుగులు చేసింది. ప్రతీక ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సహా 308 పరుగులు చేసి టీమిండియా ఫైనల్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది. కానీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమెకు విజేత పతకాన్ని చేయలేదు.

గాయం కారణంగా జట్టు నుంచి తొలగింపు
ప్రతీక రావల్ ప్రపంచ కప్ ప్రయాణం బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో ఆమె కాలికి గాయం కావడంతో ఆగిపోయింది. ఈ గాయానికి ముందు, ప్రతీక రావల్ 6 ఇన్నింగ్స్లలో 51.33 సగటుతో 308 పరుగులు చేసి భారత్ సెమీ-ఫైనల్స్కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆమె గాయం కారణంగా జట్టు మేనేజ్మెంట్ సెమీ-ఫైనల్కు ముందు ఆమె స్థానంలో షెఫాలీ వర్మను ప్రత్యామ్నాయంగా తీసుకురావాల్సి వచ్చింది.
మెడల్ దక్కకపోవడానికి కారణం: ఐసీసీ నియమం
ఐసీసీ నిబంధనల ప్రకారం, తుది 15 మంది సభ్యుల జట్టులో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచ కప్ మెడల్స్ అందజేయబడతాయి. ప్రతీక రావల్ను సెమీ-ఫైనల్కు ముందే తుది 15 మంది సభ్యుల జట్టు నుంచి అధికారికంగా తొలగించి ఆమె స్థానంలో షెఫాలీ వర్మను చేర్చారు. ఆమె చేసిన పరుగులు జట్టు విజయంలో ఎంత ముఖ్యమైనవైనా, నిబంధనల ప్రకారం ఆమె మెడల్ అందుకోలేకపోయింది. గతంలోనూ ఇలాగే 2003 పురుషుల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ఆటగాడు జాసన్ గిలెస్పీ కూడా నాలుగు మ్యాచ్లలో 8 వికెట్లు తీసినప్పటికీ, గాయం కారణంగా మధ్యలోనే తొలగించబడటంతో మెడల్ దక్కలేదు. ప్రతీక రావల్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది.
వీల్చైర్లోనే సెలబ్రేషన్స్
ఫైనల్ మ్యాచ్ రోజున డీవై పాటిల్ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ప్రపంచ కప్ను ఎగరేసుకుపోతున్న దృశ్యాన్ని రావల్ వీల్చైర్లో కూర్చుని చూసింది. భారత పతాకాన్ని భుజాలపై కప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ఇలా చెప్పింది: "నేను దీనిని మాటల్లో చెప్పలేను. నా భుజంపై ఉన్న ఈ జెండా అంటే నాకు చాలా ఇష్టం. గాయాలు ఆటలో భాగమే, కానీ నేను ఇప్పటికీ ఈ జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మేము నిజంగా గెలిచాం! ఇన్నాళ్లకు ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత జట్టు మాది. ఈ విజయం భారత్ మొత్తానికి దక్కుతుంది." అని ప్రతీక పేర్కొంది. ఫైనల్ ఆడటం కంటే వీల్చైర్లో కూర్చుని చూడటం చాలా కష్టంగా అనిపించిందని, అయితే షెఫాలీ వర్మ విజృంభణతో తాను ప్రతి బౌండరీ, ప్రతి వికెట్ను తన సహచరురాలిగానే అదే ఉద్వేగంతో సంబరాలు చేసుకున్నానని ఆమె తెలిపింది.