ముంబై: ఒకే ఇన్నింగ్స్లో 1009 పరుగులు సాధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన ముంబై బాలుడికి మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ప్రణవ్ ధనవాడేకు అభినందనలు తెలిపాడు.
ఒకే ఇన్నింగ్స్లో 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ ప్రణవ్ అని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో కొనియాడారు. ప్రపంచ క్రికెట్లో ప్రణవ్ మరిన్ని కొత్త మైలురాళ్లు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లు సచిన్ ట్వీట్ చేశాడు.
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ప్రణవ్ ధనవాడేను ప్రశంసలతో ముంచెత్తాడు. 'చాలా అద్భుతంగా ఆడావు, నువ్వు సాధించిన పరుగులు నమ్మలేని విధంగా ఉన్నాయి. మరో సచిన్ టెండూల్కర్ను చూడబోతున్నాం' అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవల్ టోర్నమెంట్లో ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై ప్రణవ్ ఒకే ఇన్నింగ్స్లో 1009 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సోమవారం 199 బంతుల్లో 652 పరుగులు సాధించిన ప్రణవ్ రెండోరోజైన మంగళవారం మరింతగా రెచ్చిపోయి ఆడాడు.
323 బంతుల్లోనే 1000 పరుగులు సాధించాడు. అందులో 59 సిక్స్లు, 129 ఫోర్లు ఉన్నాయి. 1899వ సంవత్సరంలో ఆర్థన్ కోలింగ్ చేసిన 628 పరుగులే ఇప్పటివరకు ఏ విభాగంలోనైనా అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. తద్వారా క్రికెట్లో 116 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. కాగా ప్రణవ్ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.