ముంబై: ముంబై క్రికెటర్ ప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1009 నాటౌట్తో క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. అలాంటి ప్రణవ్ పైన అతని కోచ్ కమ్ మెంటర్ మోబిన్ నెల రోజుల క్రితం బాగా సీరియస్ అయ్యాడట. నీ బిహేవియర్ మార్చుకోవాలని, క్రికెట్ పైన సీరియస్గా దృష్టి సారించాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఈ విషయాన్ని కోచ్ కమ్ మెంటర్ మోబిన్ ఓ మీడియా ప్రతినిధితో పంచుకున్నారు. ప్రణవ్ క్రమశిక్షణనే అతనిని నాలుగు వందల నిమిషాల పాటు మైదానంలో నిలిపిందని, తద్వారా 1009 పరుగులు చేశారని మోబిన్ ప్రశంసించారు.
అయితే, గతంలో ప్రణవ్ పైన తాను సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ప్రణవ్ తన అయిదేళ్ల వయస్సులో మోబిన్ కళ్యాణ్లో నడుపుతున్న మోడర్న్ క్రికెట్ క్లబ్కు వచ్చాడు.

తన అకాడమీలోని మిగతా వారిలాగే ప్రణవ్కు కూడా నేర్పించానని కోచ్ చెప్పారు. అయితే, ప్రాక్టీస్, వామప్ సమయంలో ప్రణవ్ జోకులు పేల్చుతూ సీరియస్నెస్గా కనిపించకపోయేవాడన్నారు. మిగతా వారిని ఆటపట్టించేవాడన్నారు.
ఓసారి ఆల్ ఇండియా టోర్నమెంటులో ఆడుతున్న సమయంలో.. ప్రణవ్ తాను అవుటైన సమయంలో నవ్వడం చూశానని, అప్పుడు తనకు కోపం వచ్చిందన్నారు. రిప్లేలోను బిగ్ స్క్రీన్లో అది కనిపించిందన్నారు.
అతను ఎప్పుడూ క్రికెట్ విషయంలో సీరియస్గా కనిపించలేదని, అతని తీరు తనకు ఆగ్రహం తెప్పించేదని, దీంతో అతనిని పలుమార్లు హెచ్చరించానని చెప్పారు.
ఓసారి గట్టి హెచ్చరిక చేశానని, ఉండాలనుకుంటే బిహేవియర్ మార్చుకోవాలని లేదంటే క్రికెట్ అకాడమీ నుంచి వెళ్లిపోమని గట్టిగానే చెప్పానన్నారు. ఆ తర్వాత ప్రణవ్ పూర్తిగా క్రికెట్ పైన దృష్టి సారించాడన్నారు. అయితే, ప్రణవ్ అద్భుతం చేశాడని కోచ్ కమ్ మెంటర్ మోహిన్ ఆనందం వ్యక్తం చేశారు.