హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను వదులుకోమని బంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. రంజీ జట్టులో బెంగాల్ జట్టు నుంచి ఓజాను విడుదల చేయబోమని స్పష్టం చేశాడు. దీంతో తిరిగి హైదరాబాద్కు ఆడాలన్న ప్రజ్ఞాన్ ఓజా ఆశలపై గంగూలీ నీళ్లు చల్లినట్లు అయింది.
వివరాల్లోకి వెళితే... రంజీ క్రికెట్లో గత రెండేళ్లుగా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రజ్ఞాన్ ఓజా ఈ సీజన్ కోసం తిరిగి సొంత జట్టు హైదరాబాద్కు వెళ్లాలని ఆశించాడు. ఈ మేరకు ఈ రంజీ సీజన్లో హైదరాబాద్ తరఫున బరిలో దిగేందుకు తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా క్యాబ్కు ఓజా విజ్ఞప్తి చేశాడు.
అయితే ఓజా విజ్ఞప్తిని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తిరస్కరించాడు. 'అతను విడుదల చేయాలని కోరాడు. కానీ మేం చేయం. హైదరాబాద్ ప్లేట్ డివిజన్లో ఉన్నప్పుడు ఓజా బంగాల్కు ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఓజా సేవలు మాకు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలైట్కు చేరిందని వెళితే ఎలా? అతని సేవలు మాకు అవసరం' అని గంగూలీ అన్నాడు.
అంతేకాదు ఈ సీజన్కు ముందు జరిగే శిబిరంలో ఓజా పాల్గొంటాడని గంగూలీ చెప్పాడు. దీనిపై హెచ్సీఏ కార్యదర్శి శేష్నారాయణ్ మాట్లాడుతూ బెంగాల్ నిరభ్యంతర పత్రం ఇవ్వనపుడు మేం చేయగలిగిందేమీ లేదు. గంగూలీ అంటే మాకెంతో గౌరవం. మాజీ కెప్టెన్ ఆట కోసం, ఆటగాళ్ల కోసం బాగా ఆలోచిస్తారని అన్నాడు.
2015-16 సీజన్లో హైదరాబాద్ గ్రూప్-సిలో ఉన్నప్పుడు ఓజా బంగాల్కు తరలి వెళ్ళాడు. ఆ సీజన్లో బెంగాల్కు ఆడిన ఓజా 36 వికెట్లు, గత సీజన్లో10 వికెట్లు తీశాడు.