నోయిడా: టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తలకు బంతి తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళితే.... దులీప్ ట్రోఫీలో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది.
ఇండియా గ్రీన్ జట్టు తరపున ఓజా ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి తలకు వెనుక భాగంలో బంతి తగిలింది. ఇండియా గ్రీన్ జట్టు బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లు జట్టు బ్యాట్స్మన్ పంకజ్ సింగ్ మిడ్ ఆన్ మీదగా షాట్ బాదాడు. ఫీల్డింగ్ చేస్తున్న ఓజా వైపుకు బంతి దూసుకొచ్చింది.

దీంతో ఓజా వెనక్కు తిరగగా బంతి కాస్త మెడ వనక భాగాన్ని బలంగా తాకింది. కొద్ది సమయం పాటు కోమాలోకి వెళ్లినట్టు కనిపించాడు. అంతే మిగతా ఆటగాళ్లందరూ షాక్కు గురై అతన్ని చుట్టుముట్టేశారు. వెంటనే ఇండియా గ్రీన్ హెడ్ కోచ్ రమన్ సహాయంతో ఓజాను ఆసుపత్రికి తరలించారు.
అక్కడ తనకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు చేశారు. రిపోర్టుల్లో అంత ప్రమాదం లేదని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న బీసీసీఐ అధికారులు ఓజాకు ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ప్రజ్ఞాన్ ఓజా పూర్తిగా కోలుకునే వరకూ వైద్య పర్యవేక్షణలోనే ఉంచనున్నారు.