
ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్సీఏలో కఠిన శిక్షణనిచ్చి ఉండొచ్చు అని భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. బరువు తగ్గేందుకు ఎన్సీఏలో ప్రత్యేకమైన కసరత్తులు చేయించి ఉంటారని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడాలంటే రోహిత్ కఠోరంగా సాధన చేయాలని, అప్పుడే అతడు రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నాడు.
ఐపీఎల్ 2020 ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రోహిత్ను ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ అనంతరం ఎన్సీఏలో రిహాబిలిటేషన్కు పంపించారు. మొదటి ఫిట్నెస్ పరీక్షలో విఫలమవ్వడంతో.. తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. మూడో టెస్టు కోసం ఆసీస్కు వచ్చిన రోహిత్..సిడ్నిలో 14 రోజులు క్వారంటైన్లో ఉన్నాడు. బుధవారమే జట్టుతో కలిశాడు. ఇక ఆలస్యం చేయకుండా గురువారం నెట్స్లో సాధన మొదలు పెట్టాడు.
తాజాగా ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ... 'రోహిత్ శర్మకు ఇప్పుడు కఠిన సాధన అవసరం. ఎందుకంటే 14 రోజుల క్వారంటైన్లో అతడు గదికే పరిమితమయ్యాడు. ఆసీస్ పరిస్థితులకు అలవాటు పడాలంటే బయటకెళ్లి కఠోర సాధన చేయడమే అత్యుత్తమ మార్గం. ఎన్సీఏలో రోహిత్ బాగా శ్రమించాడనే అనుకుంటున్నా. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో అతడు బాగా బరువు పెరిగాడు. కచ్చితంగా వారు బరువు తగ్గించాలనే అనుకుంటారు. సుదీర్ఘ కాలం ఆడకపోతే ఆటగాళ్లకు గాయాలవుతాయి. అందుకే వారు రోహిత్ను మ్యాచ్ ఫిట్ అయ్యేలా శిక్షణనిచ్చి ఉండొచ్చు. ఎన్సీఏలో అందరూ అతడిపైనే దృష్టి పెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు.
బాక్సింగ్ డే టెస్ట్లో అద్భుత విజయం సాధించిన భారత ఆటగాళ్లు అందరూ రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శర్మ మాత్రం నెట్స్లో చెమటోడుస్తున్నాడు. సిడ్నీలో క్వారంటైన్ను ముగించుకొని జట్టుతో కలిసిన రోహిత్.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా గురువారమే మైదానంలోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, మరో ముగ్గురు మాత్రమే రోహిత్కు సాయం చేయడానికి మెల్బోర్న్ గ్రౌండ్కు వచ్చారు.