
అప్పుడు జట్టుకు స్పాన్సర్లు దొరకలేదు:
ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ... '2008లో డక్కన్ చార్జర్స్ ఆఖరి స్థానంలో నిలిచిన తర్వాత మాకు స్పాన్సర్లు లేరు. అయితే ఆలస్యంగా స్పాన్సర్లు దొరకడంతో.. తక్కువ దుస్తులు, ట్రైనింగ్ కిట్స్తో దక్షిణాఫ్రికాకు చేరుకున్నాం. ఈ విషయాలను పట్టించుకోకుండా ఛాంపియన్గా నిలవడంపైనే దృష్టిసారించాలని కెప్టెన్ గిల్క్రిస్ట్ జట్టు సభ్యులతో చెప్పాడు. ఒక్కసారి మనం విజేతగా నిలిస్తే.. పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోతాయని అందరిలో స్ఫూర్తి నింపాడు' అని ఓజా తెలిపాడు.

ఒత్తిడి లేకుండా గిల్క్రిస్ట్ చూసుకున్నాడు:
'ఛాంపియన్గా నిలిచిన తర్వాత మా జట్టు బ్రాండ్ విలువ ఒక్కసారిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని భిన్నంగా చూశారు. అయితే తొలి సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచిన మేం రెండో సీజన్లో ఛాంపియన్గా నిలుస్తామని ఎవరూ ఊహించి ఉండరు. తొలి సీజన్కు పూర్తి భిన్నంగా ఆడాం. యాజమాన్యం, బయట నుంచి వచ్చే ఒత్తిడిని జట్టు, సహాయ బృందంపై గిల్క్రిస్ట్ పడనివ్వలేదు. జట్టును గొప్పగా నడిపించాడు' అని ఓజా పేర్కొన్నాడు.

ఓజా కీలకపాత్ర:
2009లో ఎన్నికల కారణంగా ఐపీఎల్ రెండో సీజన్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2008లో చివరి స్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్.. రెండో సీజన్లో ఛాంపియన్గా నిలిచింది. రెండో సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డెక్కన్ ఛార్జర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలవడంలో ఓజా కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో ఓజా మూడు వికెట్లు సాధించాడు. డెక్కన్ ఛార్జర్స్ ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుగా మారిన విషయం తెలిసిందే.

క్రికెట్కు వీడ్కోలు:
గత ఫిబ్రవరిలో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓజా.. 16 సంవత్సరాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. అయితే 2013 నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ.. 2019 వరకు దేశీయ క్రికెట్ ఆడాడు. ఓజా భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 113 వికెట్లు.. వన్డేల్లో 21 వికెట్లు, టీ20ల్లో10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2013లో ముంబైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓజా చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు.


Click it and Unblock the Notifications












