
ఢిల్లీ: ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) బుధవారం భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజాను తమ ప్రతినిధిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలికి నామినేట్ చేసింది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ఒక రోజు ముందు ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. గురువారం బీసీసీఐ 89వ ఏజీఎం అహ్మదాబాద్లో జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ, ఫస్ట్క్లాస్ క్రికెట్కు ఓజా వీడ్కోలు పలికారు.
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఐసీఏ నుంచి ఒక సభ్యుడిని ప్రతిఏడాది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు పంపాల్సి ఉంటుంది. గతేడాది అసోసియేషన్ నుంచి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం ఇచ్చారు. 'ఐపీఎల్ పాలక మండలికి ప్రజ్ఞాన్ ఓజాను ప్రతినిధిగా ఐసీఏ డైరెక్టర్లు నామినేట్ చేశారు. గతంలో సురీందర్ ఖన్నా తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని మేం భావిస్తున్నాం' అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా తెలిపారు.
టీమిండియా తరఫున ఆడిన ప్రజ్ఞాన్ ఓజా గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2013లో సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్టులో అతడు చివరగా ఆడారు. 2009 నుంచి 2013 వరకు 24 టెస్టులు ఆడిన ఓజా.. 113 వికెట్లు తీసుకున్నారు. 4 వికెట్లు ఐదు సార్లు, 5 వికెట్లు 7సార్లు తీసుకున్నారు. 18 వన్డేలు ఆడి 21 వికెట్లు, 6 టీ20లు ఆడి 10 వికెట్లు నేలకూల్చాడు.
ఐపీఎల్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయడమే ప్రధాన ఎజెండాగా ఏజీఎం జరగనుంది. దీంతోపాటు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు పన్ను రాయితీలు, వివిధ క్రికెట్ కమిటీల ఏర్పాటు అంశాలపై చర్చించనున్నారు.