
భారత్, సౌతాఫ్రికా సిరీస్కు గండం
ఒమిక్రాన్ కారణంగా ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడింది. టెస్టు సిరీస్ కూడా ముందుగా అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు పెరగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగతా టెస్ట్ సిరీస్తోపాటు వన్డే సిరీస్ కూడా సజావుగా సాగడం అనుమానంగానే ఉంది.
సౌతాఫ్రికాలో ఆంక్షలు కనుక విధిస్తే సిరీస్ నుంచి అర్ధాంతరంగా భారత జట్టు స్వదేశానికి తిరిగి రావడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, సౌతాఫ్రికా సిరీస్కు వాయిదా గండం పొంచి ఉందంటున్నారు నిపుణులు. దీనికి తోడు గతంలో కరోనా కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

యాషెస్ సిరీస్లో కరోనా కలకలం
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఇప్పటికే కరోనా కలకలం రేగింది. ఇంగ్లండ్ సహాయక బృందంలోని వారితోపాటు వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు ఆరుగురికి కరోనా సోకినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదు. సిరీస్లో ఇప్పటికే 3 టెస్ట్ మ్యాచ్లు ముగిసినప్పటికీ కరోనా కారణంగా మిగతా రెండు టెస్ట్ మ్యాచ్లు జరగడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.

పాకిస్థాన్ కొంపముంచిన కరోనా
పాకిస్థాన్లో క్రికెట్ ఆడడానికి వెళ్లే జట్లు చాలా అరుదు. అలాంటిది వెస్టిండీస్ వెళ్లింది. అయితే అక్కడ పాక్తో టీ20 మ్యాచ్లు ఆడుతున్న సమయంలో విండీస్ జట్టులో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆటగాళ్లతో సహా సహాయక బృందంలోని వారు కరోనా బారిన పడ్డారు. దీంతో ఏదో ఒక విధంగా టీ20 సిరీస్ను పూర్తి చేసి వన్డే సిరీస్ను వాయిదా వేశారు. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా నష్టం తప్పడం లేదు.

యూఎస్ఏ, ఐర్లాండ్ వన్డే సిరీస్ రద్దు
కరోనా వేరియంట్ కారణంగా తాజాగా మరో సిరీస్ వాయిదా పడింది. యూఎస్ఏ, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఐర్లాండ్ జట్టు సహాయక బృందంలోని వ్యక్తులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట తొలి వన్డే మ్యాచ్నే రద్దు చేసినప్పటికీ తాజాగా మొత్తం వన్డే సిరీస్ను రద్దు చేశారు.


Click it and Unblock the Notifications












