హైదరాబాద్: మహిళా క్రికెట్ మ్యాచ్లను టెలివిజన్ కవరేజి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంతో స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని టీమిండియా మాహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది.
నాలుగు దేశాల సిరిస్లో భాగంగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన తర్వాత మహిళా జట్టు భారత్కు తిరిగొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథాలీ రాజ్ పైవిధంగా స్పందించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు చాలా తక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
'భారత్లో మ్యాచ్లను వీక్షించేందుకు చాలా మంది స్టేడియాలకు వస్తారు. మహిళల క్రికెట్ను మార్కెట్ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా సిరీస్ లేదా ద్వైపాక్షిక సిరిస్లు ఆడినప్పుడు మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. తద్వారా ఎక్కువ మందికి మ్యాచ్ గురించి తెలుస్తుంది' అని చెప్పింది.
అయితే దక్షిణాఫ్రికాలో వారికి మ్యాచ్లను వీక్షించే అవకాశం లేకపోవడంతో ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారని మిథాలీ రాజ్ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో జరిగిన చతుర్ముఖ సిరిస్లో ఇండియాతో పాటు ఐర్లాండ్, జింబాబ్వే దేశాలు పాల్గొన్నాయి.
ఈ నాలుగు దేశాల సిరిస్లో పైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడ్డాయి. పైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించడం ఇది నాలుగోసారి.