
హైదరాబాద్: దేశ రాజధానిలోని కాలుష్యం తీవ్రత ఫిరోజా షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టుపై ప్రభావం చూపిస్తోంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు, రెండో రోజు ఆటగాళ్లు ముఖానికి మాస్కులు ధరించి మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు. కాలుష్యం కారణంగా శ్రీలంక క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం నిజమని ఆ జట్టు కోచ్ నిక్ పాథస్ సృష్టం చేశాడు.
జట్టులోని ఆటగాళ్లు సురంగ లక్మల్, లాహిరు గమాగె, ధనంజయ డిసిల్వా వాంతులు చేసుకున్నారని వెల్లడించారు. ఢిల్లీ టెస్టులో రెండో రోజు చోటు చేసుకున్న నాటీకయ పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే భారత వెటరన్ ఓపెనర్ గంభీర్ మాత్రం భిన్నంగా ట్వీట్ చేశాడు.

ఢిల్లీ వాతావరణ కాలుష్యం పెరిగి ఇంత ఇబ్బందులు ఎదురవుతుంటే మన నాయకులకి అనవసర విషయాలు ఎక్కువైపోయాయి అని ట్విట్టర్లో మండిపడ్డాడు. 'మూడో టెస్ట్, రెండో రోజు ఫెరోజ్ షా కోట్లాలోని స్కోర్స్ శ్రీలంక (తొలి ఇన్నింగ్స్): 131/3 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(తొలి ఇన్నింగ్స్): ఎటువంటి నష్టం లేకుండా 316! కానీ మన రాజకీయ నాయకులు సినిమాల విడుదలపై, మన డైట్ ఛార్ట్ డ్రాయింగ్పై, లేక అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు కొత్త కారణాలు వెతికేపనిలో ఉన్నారు' అని ట్వీట్ చేశాడు. గంభీర్ ట్వీట్ని పలువురు సమర్ధించగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.