హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడితే బాగుంటుందని ఆదేశ మాజీ కెప్టెన్ షాన్ పొల్లాక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరో ఆరు నెలల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లతో దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్లను ఆడనున్న నేపథ్యంలో నేపథ్యంలో డివిలియర్స్ జట్టులో ఉంటే పోటీ ఆసక్తికరంగా ఉంటుందని పొల్లాక్ అభిప్రాయపడ్డాడు.
గతేడాది జనవరిలో గాయం కారణంగా టెస్టు మ్యాచ్లకు దూరమైన డివిలియర్స్ అనంతరం గాయం నుంచి కోలుకున్నప్పటికీ... విశ్రాంతి పేరుతో సుదీర్ఘ ఫార్మాట్కి డివిలియర్స్ దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడి టెస్టు భవితవ్యంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు ఏబీ ప్రకటించాడు.

దీంతో టెస్టు ఫార్మెట్ నుంచి డివిలియర్స్ వీడ్కోలు తీసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డివిలియర్స్ మాత్రం అధికారికంగా టెస్టు క్రికెట్కు ఇంకా వీడ్కోలు పలకలేదు. 'నా అంచనా ప్రకారం డివిలియర్స్ మళ్లీ టెస్టుల్లో ఆడేలా ఒప్పించే ప్రయత్నం బోర్డు చేస్తూనే ఉంటుంది' అని పొల్లాక్ అన్నాడు.
'మరో ఆరు నెలల్లో దక్షిణాఫ్రికా భారత్, ఆస్ట్రేలియా లాంటి కఠిన ప్రత్యర్థులతో టెస్టులు ఆడనుంది. ఆ సమయంలో జట్టుతో సీనియర్గా డివిలియర్స్ ఉంటే టాప్ ఆర్డర్ పటిష్టం అవుతుంది. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ రూపంలో దక్షిణాఫ్రికాకి గట్టి సవాల్ ఎదురుకానుంది' అని పొల్లాక్ అభిప్రాయపడ్డాడు.