సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ (ఎంఐ కేప్ టౌన్) జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కీరన్ పొలార్డ్ నీచమైన పనికి పాల్పడ్డాడు. క్రీడా స్ఫూర్తిని మరిచి జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్ రద్దు కోసం ప్రయత్నించాడు. దీంతో పొలార్డ్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేప్టౌన్కు మంచి ఆరంభమే దక్కింది. పవర్ప్లేలో ఒక్క వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. చాలాసేపు తర్వాత వరుణుడి కరుణించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. చివరి రెండు ఓవర్లలో కేప్ టౌన్ ఏకంగా 37 పరుగులు సాధించింది. కెప్టెన్ పొలార్డ్ అజేయంగా 10 బంతుల్లో 33 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు బాదాడు.

అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జోబర్స్ సూపర్ కింగ్స్కు 8 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యంగా అంపైర్లు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 5.4 ఓవరల్లోనూ సూపర్ కింగ్స్ ఛేదించింది. ఓపెనర్లు ల్యూస్ డుప్లూయ్ (41*; 14 బంతుల్లో), ఫాప్ డుప్లెసిస్ (50*; 20 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. కాగా, సూపర్ కింగ్స్ ఛేదనలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెరుపు ఆరంభంతో ఛేజింగ్ను మొదలుపెట్టిన కింగ్స్ మూడు ఓవర్లలోనే 57 పరుగులు చేసింది.
అయితే మూడో ఓవర్ అనంతరం తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. మ్యాచ్ ఫలితం రావలంటే సూపర్ కింగ్స్ కనీసం అయిదు ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. అయిదు ఓవర్ల అనంతరం మ్యాచ్ ఆగిపోయినా మెరుగైన స్థితిలో ఉన్న కింగ్స్ జట్టు విజయం సాధిస్తుంది. ఒకవేళ కనీసం అయిదు ఓవర్ల పాటు ఆట సాగకపోతే మ్యాచ్ను రద్దుగా ప్రకటించి పాయింట్లను ఇరుజట్లకు సమానంగా పంచుతారు. దీంతో పొలార్డ్ ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ను ఆలస్యం చేశాడు. నాలుగో ఓవర్లో రబాడతో, అయిదో ఓవర్లో సామ్ కరన్తో పొలార్డ్ అనవసరపు చర్చలు కొనసాగించాడు. మరోవైపు ఈ సమయంలో వరుణుడు జోరు అందుకున్నాడు.
కానీ పొలార్డ్ ఆలస్యం చేయాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మ్యాచ్ సజావుగానే సాగి జోబర్గ్ సూపర్ కింగ్స్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేగాక బోనస్ పాయింట్ కూడా లభించింది. అయితే నెటింట్లో పొలార్డ్పై విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తిని మరిచి మ్యాచ్ రద్దు కోసం నీచమైన పనికి పాల్పడ్డాడని నెటిజన్లు మండిపడుతున్నారు.