కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, అలాగే వెస్టిండీస్ వైట్-బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ క్యాష్ రిచ్ లీగ్ అయిన యూఏఈలోని ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడడానికి సైన్ చేశారు. ఈ లీగ్ ను మెజారిటీ టీంలను ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది గ్లోబల్ టీ20స్టార్లు ఈ లీగ్ లో పాల్గొనడానికి తమ పేరు నమోదు చేసుకున్నారు. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇక ఈ టీం మార్క్యూ ప్లేయర్ ల జాబితాలో పొలార్డ్, బ్రావో, పూరన్ లు చేరారు. ఈ మేరకు అక్కడి మీడియాలో ప్రకటనలొచ్చాయి. ఈ ముగ్గురే కాకుండా దసున్ షనక, ఒల్లీ పోప్, ఫజల్ హాక్ ఫరూఖీ తదితర ప్లేయర్లు ఈ టోర్నీల్లో ఆడడానికి సంతకాలు చేశారు. ఎమిరేట్స్ క్రికెట్ జనరల్ సెక్రటరీ ముబాష్షీర్ ఉస్మానీ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో టీ20 ఫార్మాట్లోనే యోధులు అని పేర్కొనదగ్గ వారు సంతకాలు చేయడం వల్ల ఈ లీగ్ ప్రతిష్ఠ మరింత పెరగనుందన్నాడు. మార్క్యూ ప్లేయర్లు లిస్ట్ లో మరింత మంది స్టార్ ప్లేయర్లతో పాటు యువ ప్రతిభావంతులు కూడా చేరాలని సదా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ILT20 లీగ్ దుబాయ్, షార్జా మరియు అబుదాబి వేదికలుగా జరగనుంది. మొత్తంగా 34మ్యాచ్ లు జరుగుతాయి. ఈ లీగ్ కు ఇప్పటికే ఐసీసీ నుంచి ఆమోదం లభించింది. ఫ్రాంచైజీ యజమానులలో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ కతా నైట్ రైడర్స్, కాప్రీ గ్లోబల్, GMR, లాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్ లైన్ ఉన్నాయి.