
హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్(సీఈసీ) షెడ్యూల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు.
ఇందులో భాగంగా టీమిండియా క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్లతో పాటు షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్... ఫోగట్ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్లను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
"ప్రియమైన ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. మీరు క్రికెట్ మైదానంలో అత్యుత్తమ రికార్డుల్ని నెలకొల్పారు. కానీ.. ఈసారి దేశంలోని 130 కోట్ల మందిలో స్ఫూర్తి నింపి రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొనేలా చేయండి. అలా చేయగలిగితే.. ప్రజాస్వామ్యం గెలుస్తుంది" అని మోడీ తన ట్వీట్లో ట్వీట్ చేశారు.
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ మొత్తం ఏడు దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మే 23న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే, బుధవారం ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా తలపడుతోంది.
ఐదు వన్డేల సిరిస్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు నెగ్గడంతో 2-2తో సమం అయింది. ఆఖరి వన్డేలో గెలిచిన జట్టు సిరిస్ను కైవసం చేసుకుంటుంది. ఈ సిరిస్ అనంతరం మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది.