న్యూఢిల్లీ: ప్రపంచ కప్ 2015 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. ఆదివారం నాడు (15వ తేదీన) పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మోడీ స్వయంగా నవాజ్ షరీఫ్కు ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు.
క్రికెట్ గురించి వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఒకరి జట్టుకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారన్నారు. 1992లో పాకిస్తాన్ కప్పు గెలవడాన్ని మోడీ ప్రస్తావించారు.
ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు ప్రారంభించాలని షరీఫ్ కోరారు. త్వరలో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి కార్యదర్శులను పంపుదామని, అక్కడ వారు తాజా పరిస్థితులను చర్చిస్తారని మోడీ చెప్పారని తెలుస్తోంది.

సార్క్ దేశాలకు మోడీ శుభాకాంక్షలు
ప్రపంచకప్ నేపథ్యంలో సార్క్ దేశాలకు ప్రధాని మోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు ష్రఫ్ ఘనీ, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలతో మాట్లాడానని, ప్రపంచకప్ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపానని ట్వీట్ చేశారు.
ఐదు సార్క్ దేశాలు ప్రపంచకప్ ఆడబోతుండటం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచకప్ క్రీడాస్ఫూర్తిని అందిస్తుందని ఆశిస్తున్నాననిచెప్పారు. క్రీడా ప్రేమికులకు ఇదో మంచి ట్రీట్ అన్నారు. పలు ప్రాంతాల ప్రజలను క్రికెట్ కలుపుతుందని, సుహృద్భావాన్ని వ్యాప్తి చేస్తుందని, సార్క్ దేశాల ఆటగాళ్లు ఫాషన్తో ఆడతారని, వారి దేశాలకు గౌరవం తీసుకొస్తారని అనుకుంటున్నానని చెప్పారు.