ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ భారత్ గడ్డకు చేరింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణ తెరపడిన అయిదు రోజులకు కప్ ఇంటికొచ్చింది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్టులో వేచి ఉన్న అభిమానులు భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు టీమిండియా కూడా ఫ్యాన్స్ను ఉత్సాహపరిచింది. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో భారత ఆటగాళ్లు అలరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య మాస్ డ్యాన్స్తో ఇరగదీశారు.

అయితే హోటల్లో కాసేపు సేద తీరిన అనంతరం టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉదయం 11 గంటలకు మోదీని కలుసుకున్నారు. ప్రధానితో కలిసి అల్ఫాహారం తిన్నారు. విశ్వవేదికపై భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు. భారత ఆటగాళ్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. రౌండ్ టేబుల్లా కూర్చొని అందరూ మాట్లాడారు. కోచ్ రాహుల్ దవ్రిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న జస్ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్గా నిలిచిన విరాట్ కోహ్లి ప్రత్యేకంగా మాట్లాడారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత ఆటగాళ్లతో కలిసి మోదీ సరదాగా ముచ్చటించారు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్పై జోకులు పేల్చారు. టీ20 వరల్డ్ కప్ను ప్రధాని మోదీకి కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ సంయుక్తంగా అందించారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగారు. కాగా, సమావేశం ముగిసిన తర్వాత భారత జట్టు ముంబైకి బయల్దేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే షోలో రోహిత్ సేన పాల్గొననుంది. రెండు గంటల పాటు ఈ ఊరేగింపు జరగనుంది. ఆ తర్వాత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం జరగనుంది.