
హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరిట పిలుపునిచ్చిన ఫిట్నెస్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా బాగానే పాపులర్ అయింది. పుషప్స్ చేసిన వీడియోను పోస్టు చేసిన రాథోడ్ విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, హృతిక్ రోషన్కు ఈ సవాలును విసిరారు. దీన్ని స్వీకరించిన కోహ్లీ.. ఫిట్నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోడీ, సహచర ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఈ సవాలును స్వీకరించమంటూ కోరాడు.
కోహ్లీ సవాలును స్వీకరించిన మోడీ.. త్వరలో నా ఫిట్నెస్ వీడియోను పోస్టు చేస్తానని ట్విటర్ వేదికగా బదులిచ్చారు. తాజాగా మోదీ ఫిట్నెస్ వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'యోగా కాకుండా నేను ప్రతి రోజు ఉదయం చేసే వ్యాయామాలివి. పంచభూతాలైన నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నుంచి నేను స్ఫూర్తి పొందాను. ఇలా చేయడం వల్ల నేను ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగలుగుతున్నాను. అంతేకాదు శ్వాసకు సంబంధించిన వ్యాయామం కూడా చేస్తాను' అని మోదీ పేర్కొన్నారు.
అనంతరం ఈ ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇటీవల ఆసీస్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో నాలుగు పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు దేశంలో నాలుగు పదులు పైబడిన ఐపీఎస్ అధికారులందర్నీ మోడీ ఈ ఛాలెంజ్ను పంపారు.
క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ కథానాయకులు ఒకరికొకరు ఈ ఫిట్నెస్ సవాలును విసురుకుంటూ ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. భారత క్రికెటర్లు అయితే విదేశీ క్రికెటర్లకు సైతం ఈ సవాలును విసరడంతో ఛాలెంజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.