భారత్లో క్రికెట్కు ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ ఎన్నో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి మరో స్టేడియం కలవనుంది. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన కాశీలో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక్కడి గంజరి ప్రాంతంలో నిర్మించనున్న ఈ స్టేడియానికి ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణం కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మొత్తం 30 వేల మంది ప్రేక్షకుల కెపాసిటీతో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచులు కూడా నిర్వహించేలా దీన్ని నిర్మిస్తారట.

బీసీసీఐ, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కలిసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయట. ఈ కార్యక్రమానికి పలువురు క్రికెట్ స్టార్లు కూడా హాజరవుతారని సమాచారం. ప్రధాని మోదీ వచ్చే ఈ కార్యక్రమం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టామని డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు.
'సెప్టెంబర్ 23న స్టేడియం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోదీ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం గంజరిలో ఏర్పాట్లు మొదలయ్యాయి. బీసీసీఐ అధికారులతోపాటు స్టార్ క్రికెటర్లు కూడా హాజరయ్యే ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది' అని ఆయన వివరించారు.
ఎల్ అండ్ టీ సంస్థ ఈ స్టేడియం డిజైన్ను రూపొందించింది. యూపీసీఏ దీనికి ఆమోదం తెలిపిన అనంతరం.. వివిధ శాఖల నుంచి నో-ఆబ్జెక్షన్ పరిమితులు తీసుకుంటారు. మొదటి దశలో స్టేడియం కోసం స్థల సమీకరణ జరగనుంది. ఇది పూర్తయిన తర్వాత స్టేడియం బౌండరీ గోడ నిర్మిస్తారు.
భూ సమీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.120 కోట్లు జారీ చేసింది. మిగతా రూ.330 కోట్లను స్టేడియం నిర్మాణం కోసం దశల వారీగా విడుదల చేస్తుందని సమాచారం. యూపీ నుంచి సురేష్ రైనా, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా, మహమ్మద్ కైఫ్, ప్రవీణ్ కుమార్ వంటి పలువురు ప్లేయర్లు భారత్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
వారణాసిలో నిర్మించే ఈ స్టేడియం వల్ల మరింత మంది యువతకు క్రికెట్పై ఆసక్తి పెరుగుతుందని, భవిష్యత్తు వైపు వాళ్లు అడుగులు వేసేందుకు స్టేడియం ఉపకరిస్తుందని పలువురు అంటున్నారు. ఏదేమైనా ఈ స్టేడియం డిజైన్ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఇదే స్థాయిలో కనుక స్టేడియం ఉంటే అదిరిపోతుందని అంటున్నారు.