
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓటమి చెందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్వేగానికి గురయ్యారు. టీమిండియా ఓటమి చెందడం తనను బాధించిందని అన్నారు. జట్టు ఓడిపోయినప్పటికీ.. అసమానమైన ప్రతిభను చూపిందని ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టు పోరాటం గొప్పదని, అద్భుతమని కితాబిచ్చారు. ఓటమిని స్వీకరించడానికి ముందు- భారత క్రికెటర్ల పోరాట స్ఫూర్తిని అభినందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు..ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొద్దిసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ ఓటమి తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని మోడీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ- క్రికెటర్ల పోరాట స్ఫూర్తిని తనను ఆకట్టుకుందని అన్నారు. మ్యాచ్ చిట్టచివరి బంతి వరకు క్రికెటర్లు యోధులుగా పోరాడారని ప్రశంసించారు. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం నుంచీ భారత జట్టు గొప్పగా రాణించిందని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ అసమాన ప్రతిభను ప్రదర్శించిందని చెప్పారు. ఇది గర్వకారణమని అన్నారు. జీవితంలో గెలుపోటములు అత్యంత సహజమని ఓదార్చారు. భవిష్యత్తులో ఆడబోయే అన్ని టోర్నమెంట్లు, సిరీస్లు, మ్యాచుల్లో ఘన విజయాలను సాధించాలని నరేంద్ర మోడీ అకాంక్షించారు.