
హైదరాబాద్: కోల్కతా టెస్టులో భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్ల చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని... అనిల్ కుంబ్లే విరిగిన దవడతో బౌలింగ్ చేసిన ఉదాహరణలను ఉదహరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విద్యార్థులను ప్రేరేపించారు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం 'పరీక్షాపే చర్చ' కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుని ప్రస్తావించారు.
స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్మన్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది.
"మన జట్టు కష్టాల్లో పడింది. ఆటగాళ్ల మూడ్కూడా బాగాలేదు. ఆ స్థితిలో లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్స్ను మరిచి పోగలమా. వారు మ్యాచ్ను మనవైపు తిప్పారు" అని ప్రధాని మోడీ సోమవారం ఈ టెస్టుని గుర్తు చేశారు. "అలాగే 2002లో వెస్టిండీ్సతో ఆంటిగ్వా టెస్ట్లో గాయపడి కుంబ్లే బౌలింగ్ చేయడాన్ని మరువగలమా? ఇవన్నీ మనల్ని ఉత్తేజితం చేసే సంఘటనలే. ఆశావహ దృక్పథాన్ని కలిగించేవే" అని అన్నారు.