హైదరాబాద్: భారత క్రీడాకారుల పట్టుదల అద్భుతమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అహ్మదాబాద్లోని మణీనగర్లో అత్యాధునిక వసతులతో కూడిన ట్రాన్స్స్టేడియా ఎరీనాను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రజలంతా క్రీడలకు మద్దతిచ్చే సంస్కృతిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే రెండు సూపర్ సిరిస్లు సాధించిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇక ట్రాన్స్స్టేడియా ఎరీనా విషయానికి వస్తే అంతర్జాతీయ హంగులతో, అత్యున్నత ప్రమాణాలతో సకల క్రీడాసౌకర్యాలకు వేదికగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్కోచ్ గోపీచంద్, శ్రీకాంత్, గగన్ నారంగ్, సుశీల్కుమార్, బైచుంగ్ భూటియా, దీపా మాలిక్, అనూప్కుమార్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ పాల్గొన్నారు.
కిదాంబి శ్రీకాంత్కు కేంద్ర క్రీడా మంత్రి సన్మానం
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ అభినందించారు. ఢిల్లీలో శనివారం శ్రీకాంత్, కోచ్ పుల్లెల గోపీచంద్ను విజయ్ గోయల్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను శ్రీకాంత్ కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.శ్రీకాంత్ సాధించిన వరుస విజయాలతో దేశం ఎంతో గర్విస్తోందని అన్నారు.
ఇదిలా ఉంటే విజయ్ గోయల్ క్రీడలకు ఇస్తోన్న మద్దతుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తోందని శ్రీకాంత్ ట్విటర్ ద్వారా మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు.