
ఢిల్లీ: ఆస్ట్రేలియాపై టీమిండియా అనితర సాధ్యమైన విజయం సాధించింది. 32 ఏళ్లుగా ఓటమెరుగని బ్రిస్బేన్లో కంగారూల పని పట్టింది. గబ్బా కోటను బద్ధలు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్లో గెలిచి 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించినందుకు అత్యంత సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
'ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించడం అత్యంత సంతోషాన్ని కలిగించింది. ఆటగాళ్ల ఎనర్జీ, ఆట పట్ల తమకున్న అభిరుచి, పట్టుదల, గెలవాలనే సంకల్పం టోర్నీ ఆద్యంతం కనిపించింది. ఈ గెలుపు దేశానికి గర్వకారణం. టీమిండియాకు అభినందనలు. రాబోయే టోర్నీల్లోనూ మీరు మరిన్ని విజయాలు సాధించాలి' అని పీఎం నరేంద్ర మోడీ తన ట్వీటర్లో పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అభినందనలు తెలిపారు. జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారినపడినా.. ఉన్న ఆటగాళ్లతోనే ఇండియా జట్టు అద్భుతం చేసిందన్నారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు. కెప్టెన్ అజింక్య రహానే, జట్టు సభ్యులకు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కూడా భారత జట్టును ప్రశంసించారు. 'అద్భుతమైన జట్టు. అసాధారణమైన మ్యాచ్. మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం. 2021 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించారు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
భారత జట్టు అపూర్వ విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. అడిలైడ్ టెస్ట్ తర్వాత మా సామర్థ్యాన్ని అనుమానించిన వాళ్లంతా ఒక్కసారి ఈ విజయాన్ని చూడండి అంటూ ట్వీట్ చేశాడు. 'ఏమా విజయం. మా సామర్థ్యాన్ని అనుమానించిన వాళ్లంతా ఒక్కసారి ఈ విజయాన్ని చూడండి. అత్యద్భుతమైన ప్రదర్శన. ప్లేయర్స్ చూపించిన తెగువ, సంకల్ప బలం నిజంగా అద్భుతం. బాయ్స్ మీరు సూపర్. ఈ చారిత్రక విజయాన్ని ఆస్వాదించండి' అని కోహ్లీ ట్వీటాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటన్నారు. 'ప్రతి సెషన్కి కొత్త హీరో వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నాం. గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి. కంగ్రాట్స్ ఇండియా' అని సచిన్ ట్వీట్ చేశారు.