
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసింది. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ ఫైనల్లో ఢీ కొట్టనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఈ చారిత్రాత్మక మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఐపీఎల్ 2022 ఛాంపియన్గా ఎవరు ఆవిర్భవిస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ సీజన్.. కొత్త ఛాంపియన్ను అందిస్తుందా? లేక.. పాత ముఖమేనా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.
సాధారణంగా ఐపీఎల్ టోర్నమెంట్లో లీగ్, ప్లేఆఫ్స్ దశలో సాయంత్రం షెడ్యూల్ చేసిన మ్యాచ్లన్నీ 7:30 గంటలకు ఆరంభం అయ్యాయి. ఫైనల్స్ మాత్రం దీనికి కాస్త భిన్నం. ఓ అరగంట వెనక్కి జరిపించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీనికి కారణం- సెలబ్రేషన్స్ను నిర్వహిస్తుండటమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2020, 2021 సీజన్లు చప్పగా ముగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల ఎలాంటి సెలబ్రేషన్స్ను చేపట్టలేదు.
ఇప్పుడలాంటి వాతావరణం లేదు. అందుకే- ఈ సీజన్ క్లోజింగ్ సెరిమనీని కన్నులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది బీసీసీఐ. 1,10,000 మంది ప్రేక్షకులు ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. ఇదే స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ను 85,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. తొలిసారిగా పూర్తి సామర్థ్యంతో నిండిపోనుంది.
లోకల్ టీమ్ గుజరాత్ టైటాన్స్.. ఫైనల్స్ చేరడం, హోమ్ పిచ్పై మ్యాచ్ జరగబోతోండటం అక్కడి వారిని మరింత ఉత్సాహపరుస్తోంది. ఈ ముగింపు ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. వారిద్దరి సొంత రాష్ట్రం గుజరాతే. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి హర్ష్ రమేష్ సంఘ్వీ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ధన్రాజ్ నత్వాని, బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి, అమిత్ షా కుమారుడు జయ్ షా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధులు ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
ప్రస్తుతం ప్రధాని మోడీ, అమిత్ షా గుజరాత్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. శనివారం కలోల్లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను మోడీ ప్రారంభించారు. రాజధాని గాంధీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇవ్వాళ కూడా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరి కొన్నింటిని ప్రారంభించనున్నారు.
కాగా ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది గుజరాత్ ప్రభుత్వం. 17 డీసీపీలు, నలుగురు డీఐజీలు, 28 మంది ఏసీపీలును ప్రత్యేకంగా నియమించింది. 51 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 268 మంది సబ్ ఇన్స్పెక్టర్లను ఫైనల్ మ్యాచ్ భద్రత కోసం అపాయింట్ చేసింది. 1,000 మంది హోమ్ గార్డుల పహారాలో నరేంద్ర మోడీ స్టేడియం ఉంటుంది. అడుగడుగునా తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డులు, టికెట్స్ లేనిదే ఎవ్వరినీ లోనికి అడుగుపెట్టనివ్వని పరిస్థితి ఏర్పడింది.