ఐపీఎల్ 2023 ప్రారంభం అవడానికి ముందు అన్నిటికన్నా బలమైన జట్ల పేర్లు రాస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-3లో నిలిచింది. కానీ ఆ టీం ప్రదర్శన మాత్రం ఆ స్థాయిలో లేదు. చివరి నిమిషంలో చేతులెత్తేసే బౌలర్లు, అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని బ్యాటర్లు.. ఇలా ఆ జట్టు మొత్తం గందరగోళంగా మారింది.
కొత్త కుర్రాళ్లు తమకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు. మహిపాల్ లోమ్రోర్ ఈ సీజన్ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో రాణించాడు. సూయష్ ప్రభుదేశాయి ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. షాబాజ్ అహ్మద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సిరాజ్ కూడా గత కొన్ని మ్యాచుల్లో గాడి తప్పాడు.

ఈ జట్టు ఇంతగా విఫలం అవడం వెనుక కేవలం ఆటగాళ్లదే తప్పు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆ టీం మేనేజ్మెంట్ కూడా కొన్ని చెత్త నిర్ణయాలతో ఓటముల్లో తను కూడా చెయ్యేసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని పంపాలో కూడా ఆ టీం సరిగా నిర్ణయించుకోలేకపోయింది. అలా ఇంపాక్ట్ ప్లేయర్గా పంపిన ఆటగాళ్లు కూడా విఫలమయ్యారు.
గత మ్యాచ్లో డీహైడ్రేషన్కు గురై ఇబ్బంది పడుతూ మైదానం వీడిన దినేష్ కార్తీక్.. ఇప్పుడిప్పుడే ఫామ్ అందుకుంటున్నాడు. ఇక బంతితో మాయ చేస్తాడనుకున్న వానిందు హసరంగ పెద్దగా ప్రభావం చూపడం లేదు. అతని బ్యాటింగ్ నైపుణ్యాలను టీం సరిగా యూజ్ చేసుకోవడం లేదు. హర్షల్ పటేల్, విజయ్కుమార్ విఫలం అవుతూనే ఉన్నారు.
ఇలాంటి సమస్యలతో జైపూర్లో అడుగు పెట్టిందీ టీం. ఇక్కడ రాజస్థాన్ జట్టుకు అదిరిపోయే రికార్డు ఉంది. చివరి మ్యాచ్లో కోల్కతాను ఎంత చిత్తుగా ఓడించిందో చూశాం. ఈ క్రమంలో ఇక్కడ బెంగళూరు గెలవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంటుంది.
మరి ఈ జట్టులో బెంగళూరు గెలవాలంటే తమ కాంబినేషన్ను సరిగా ఎంచుకోవాలి. కేదార్ జాదవ్ వంటి వాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తే నయం. ఇంకా గట్టిగా మాట్లాడితే డీకే, మహిపాల్ లోమ్రోర్లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తే ఆ జట్టు వద్ద ఇంకా మంచి ఆప్షన్స్ ఉంటాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, కేదార్ జాదవ్, వానిందు హసరంగ, జోష్ హాజిల్వుడ్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్