ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెడీ అవుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. చిన్న గాయం కారణంగా ఆర్సీబీ గత రెండు మ్యాచులకు దూరమైన మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ ఈ మ్యాచ్లో తిరిగి ఆడేందుకు రెడీ అవుతున్నాడు.
ఆసీస్ పేస్ గుర్రం జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో చివరి రెండు మ్యాచులు ఆడలేదు. మడమ గాయంతో ఇబ్బంది పడుతున్న అతను ఈ మ్యాచ్లో కూడా ఆడేది అనుమానమే. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన వేన్ పార్నెల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో గాయంతో ఇబ్బంది పడుతున్న వానిందు హసరంగ కోలుకున్నట్లు తెలుస్తోంది.

అతను లేకపోవడంతో ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ విభాగం భారం మోస్తున్న కర్ణ్ శర్మ చాలా అంటే చాలా భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో హసరంగను జట్టులోకి తీసుకోక ఆర్సీబీకి తప్పేలా లేదు. అయితే అతని కోసం ఎవర్ని పక్కన పెట్టాలనేది ప్రధాన సమస్య. వేన్ పార్నెల్ను పక్కన పెడితే ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం చాలా బలహీనపడుతుంది. అందుకని గ్లెన్ మ్యాక్స్వెల్ను పక్కన పెట్టడం అసాధ్యం.
ఇక కెప్టెన్ డుప్లెసిస్ లేకుండా ఆ జట్టు బరిలో దిగదు. దీంతో బ్రేస్వెల్ను పక్కన పెట్టాల్సి వచ్చేలా ఉంది. అయితే అతను ఆడిన ప్రతి మ్యాచ్లో బ్రేస్వెల్ చక్కగా రాణించాడు. సన్రైజర్స్పై కూడా ఆర్సీబీకి బంతితో బ్రేక్ ఇచ్చింది అతనే. అవసరమైతే బ్యాటుతో కూడా అద్భుతంగా రాణించగల సత్తా బ్రేస్వెల్కు ఉంది. అలాగే ప్రస్తుతం హసరంగ అంత గొప్ప ఫామ్లో లేడు.
ఈ క్రమంలో అతన్ని జట్టులోకి తీసుకోకపోయినా ఆర్సీబీకి పెద్దగా నష్టం లేదని పలువురు నిపుణులు అంటున్నారు. అయితే నిఖార్సయిన స్పిన్నర్ లేని లోటు కూడా ఆ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ లోటును పూడ్చుకోవాలంటే హసరంగ ఆడక తప్పదు. అతని కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎవర్ని పక్కన పెడుతుందో చూడాలి.

ఆర్సీబీ జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, మైఖేల్ బ్రేస్వెల్, కర్ణ్ శర్మ, వేన్ పార్నెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్