ఐపీఎల్లో మరో కీలక పోరుకు అంతా సిద్ధమైంది. బ్యాటింగ్ బలంగా ఉన్న పంజాబ్, గుజరాత్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. చివరి మ్యాచ్లో గుజరాత్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఉత్కంఠ భరిత మ్యాచ్లో ఓడింది. లాస్ట్ ఓవర్లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించుకున్నాడు.
అలాగే పంజాబ్ కూడా తమ చివరి మ్యాచ్లో ఓటమి చవి చూసింది. సన్రైజర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ శిఖర్ ధవన్ (99 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ అంత భారీ లక్ష్యం కాకపోవడంతో సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. దీంతో చివరి మ్యాచుల్లో ఓటములు చవిచూసిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో విజయం కోసం పోరాడేందుకు రెడీ అయ్యాయి.

మొహాలీ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. అదే సమయంలో బ్యాటర్లు కూడా కుదురుకుంటే భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. దీంతో పేస్ బౌలింగ్పై రెండు జట్లు ఫోకస్ పెట్టనున్నాయి. గత మ్యాచ్లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చిన యష్ దయాళ్కు గుజరాత్ విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతనిపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
అదే సమయంలో పంజాబ్లో కూడా కీలక బ్యాటర్ రిటర్న్ అవుతున్నాడు. మిడిల్, డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించే లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. అతను బౌలింగ్లో కూడా జట్టుకు సహాయపడే అవకాశం ఉంది. లివింగ్స్టోన్ వస్తే అతని కోసం జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజాను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. బౌలింగ్లో అయితే పంజాబ్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అర్షదీప్ సింగ్ ఆ జట్టుకు కీలకంగా మారనున్నాడు.
పంజాబ్ జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, శామ్ కర్రాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్
గుజరాత్ జట్టు (అంచనా): శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి