లంక ఆటగాళ్లను నిషేధించాలి
శుక్రవారం సయీద్ అజ్మల్ ఓ మీడియాతో మాటాడుతూ... 'శ్రీలంక ఆటగాళ్లు పాక్ పర్యటన నుండి తప్పుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే..పాకిస్థాన్లో ఇప్పుడు భద్రత ఎంతో మెరుగైంది. భద్రత పరంగా సరైన పరిస్థితులు లేకుంటే మా బోర్డు లేదా ప్రభుత్వం ఏ దేశాన్ని పాకిస్తాన్లో ఆడమని అడగదు. గత రెండేళ్లుగా మేమెంతో అంతర్జాతీయ క్రికెట్, పీఎస్ఎల్ ఆడాం. పీఎస్ఎల్లో ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు, విదేశీ క్రికెటర్లు కచ్చితంగా వారి దేశం తరఫున ఇక్కడ పర్యటించాలి. నిరాకరిస్తే వారిని పీఎస్ఎల్ ముసాయిదాలో చేర్చొద్దు' అని సయీద్ అజ్మల్ మండిపడ్డాడు.
పరిస్థితులు ఇప్పుడెంతో మారాయి
'పదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగినప్పుడు నేను కూడా పాక్ బస్సులో ఉన్నా. పరిస్థితులు ఇప్పుడెంతో మారాయి. పరిస్థితులు మారినప్పటి నుండి చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాకిస్థాన్లో ఆడారు. లంక ఆటగాళ్లు కూడా పీఎస్ఎల్ ఆడారు. కాబట్టి ఈ 10 మంది శ్రీలంక ఆటగాళ్లు పాక్ పర్యటన నుండి తప్పుకోవడానికి ఎటువంటి కారణం లేదు. ప్రతిదీ సానుకూలంగా ఆలోచిస్తే మంచిది. లంక క్రికెటర్లపై ఐపీఎల్ ఒత్తిడి ఉంటుందని అనుకోవడం లేదు. పాక్లో అంతర్జాతీయ క్రికెట్ను తిరిగి ప్రవేశపెట్టడమే మాకు అత్యంత ముఖ్యం' అని ఇక్బాల్ పేర్కొన్నాడు.
అఫ్రిది వ్యాఖ్యలను విభేదించిన పాక్ ఆటగాళ్లు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. పాకిస్తాన్ పర్యటనకు రాకుండా శ్రీలంక ఆటగాళ్లను బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యాలు బెదిరించాయని షాహిద్ అఫ్రిది ఆరోపించారు. ఐపీఎల్ను ముడిపెట్టి లంక క్రికెటర్లపై ఒత్తిడి తేవడంతోనే ఆ దేశానికి చెందిన 10 మంది క్రికెటర్లు పాక్ పర్యటనకు రాలేమంటూ తెల్చేశారని అఫ్రిది మండిపడ్డాడు. అయితే అజ్మల్, ఇక్బాల్ లంక క్రికెటర్లపై ఐపీఎల్, భారత్ ఒత్తిడి చేసిందన్న అఫ్రిది వ్యాఖ్యలతో విభేదించారు.