బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కష్టాలు ఏ మాత్రం తగ్గడం లేదు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) 2025-26 సీజన్ను ఆటగాళ్లు సామూహికంగా బహిష్కరించారు. గురువారం జరగాల్సిన మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు స్టేడియానికి చేరుకోకపోవడంతో బోర్డు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లను బీసీబీ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం 'ఇండియా ఏజెంట్లు' అని విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి నిరసనగా ఆ దేశ క్రికెటర్ల సంఘం (CWAB) సమ్మెకు పిలుపునిచ్చింది. నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేసే వరకు మైదానంలోకి అడుగుపెట్టేది లేదని ఆటగాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు.

బోర్డుకు చుక్కెదురు
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్ల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఆటగాళ్లు మాత్రం హోటల్ గదులకే పరిమితమయ్యారు. టీమ్ బస్సులు ఖాళీగా కనిపించాయి.బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, టికెట్లు కొనుక్కున్న అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్ మధ్యలో ఇలా జరగడం వల్ల బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
దిక్కుతోచని స్థితిలో బీసీబీ
పరిస్థితిని చక్కదిద్దేందుకు బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆటగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే నజ్ముల్ ఇస్లాంకు బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసినా, అతను పూర్తిగా రాజీనామా చేయాల్సిందేనని క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. వార్త ముదురుతున్న కొద్దీ బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది? లేదా ఆటగాళ్ల డిమాండ్కు తలొగ్గుతుందా? అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠగా మారాయి.