హైదరాబాద్: క్రికెట్లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఆటగాళ్లదేని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ సందర్భంగా సెహ్వాగ్ మీడియాతో మాట్లాడాడు. 'బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఇలాంటి వ్యవహారాలను ఎవరూ ఆపలేరు. అయితే ఎవరిని కలుసుకుంటున్నాం అనేది ప్రతి ఆటగాడికి తెలిసుండాలి. తన మనస్సాక్షి స్పష్టంగా ఉన్నప్పుడే ఆటను కూడా క్లీన్గా ఉంచగలరు' అని సెహ్వాగ్ అన్నాడు.

తన నిజాయతీ, సమగ్రతను ఎవరూ ప్రశ్నించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆటగాడిపైనే ఉంటుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'ఎంత భద్రత ఉన్నా ఓ ఆటగాడు ఫిక్సింగ్కు పాల్పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. తనను ఎవరూ తప్పుపట్టకూడదనే విచక్షణ ఎవరికి వారు కలిగి ఉంటేనే ఈ మార్పు సాధ్యం' అని పేర్కొన్నాడు.
'క్రికెట్ ఆడే రోజుల్లో ఎవరైనా నాపై బెట్టింగ్ వ్యాఖ్యలు చేసుంటే నేను రిటైర్ అవుతానని చెప్పేవాడిని .ఇప్పుడైతే నేను సాధించిన రికార్డులన్నీ తొలగించాలని విజ్ఞప్తి చేసేవాడిని. ముఖ్యంగా ఫిక్సింగ్ మహమ్మారి పారిపోవాలంటే ఆటగాళ్లు వంద శాతం నిజాయితీగా ఉండాలి' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.