
దుబాయ్: గత కొన్నేళ్లుగా మంచి విజయాలను సాధిస్తూ దూకుడు మీదున్న భారత జట్టు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. హాట్ ఫెవరెట్గా బరిలోకి దిగిన భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్పై వరుస ఓటముల ఎదుర్కొంది. రెండు దారుణమైన పరాజయాలతో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 నుంచే భారత్ ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు టీమిండియాతో బరిలోకి దిగాలంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరస్థితి ఉండేది. కానీ తాజాగా పాక్, న్యూజిలాండ్ జట్లు అలవోక విజయాలు భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. వరుస ఓటములతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరాడు.
భారతీయ అభిమానుల కోసం ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ హిందీలో ఓ ట్వీట్ చేశాడు. ఆటలో గెలుపోటములు సహజమే అని కేపీ అన్నాడు. క్రీడాకారులు ఏం రోబోలు కాదన్నాడు. 'ఏదైనా ఆటలో గెలుపు, ఓటములు ఉంటాయి. ఇది సహజం. ఏ ఆటగాడు ఓడిపోవడానికి మ్యాచ్ ఆడడు. మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. క్రీడాకారులు ఏం రోబోలు కాదు ప్రతి మ్యాచ్ గెలవడానికి. ఆటగాళ్లకు అన్ని సమయాల్లో మద్దతు అవసరం. దయచేసి ఈ విషయం గ్రహించండి' అని కెవిన్ ట్వీట్ చేశాడు. కెవిన్ ఎపుడూ టీమిండియాకు మద్దతు ఇస్తాడన్న విషయం తెలిసిందే.
కెవిన్ పీటర్సన్ టీమిండియాకు మద్దతుగా నిలిస్తే.. మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం విమర్శల వర్షం కురిపించాడు. 'టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించే దశలో ఉంది. ఎంతో ట్యాలెంట్ ఉన్న టీమిండియా జట్టు.. టోర్నీలో ఆడుతున్న వైనం బాగాలేదు. ఆటగాళ్ల మైండ్సెట్, మ్యాచ్లో వాళ్లు ప్రదర్శిస్తున్న విధానం చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆడే విధానం పూర్తిగా మారిపోయింది. అయినా కూడా భారత్ 2010లో ఆడినట్టే ఆడుతోంది' అని వాన్ వరుస ట్వీట్లు చేశాడు. 'భారత జట్టులో ట్యాలెంట్ బాగుంది. కానీ వైట్బాల్ క్రికెట్లో చాన్నాళ్ల నుంచి భారత ఆటగాళ్లు పెద్దగా రాణించడంలేదు. వివిధ దేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్ల్లో ఇండియన్ ప్లేయర్లు ఆడే విధంగా అవకాశాలు ఇవ్వాలి. ఐపీఎల్ మినహా ఇతర లీగ్ల్లో భారత ప్లేయర్స్ ఆడడం లేదు. దాంతో వాళ్ల ట్యాలెంట్ వృధా అవుతోంది' అని వాన్ మరో ట్వీట్ చేశాడు.
సూపర్-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన కోహ్లీసేన పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. కివీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్, నమీబియాలపై గెలిస్తే సెమీస్ చేరనుంది.ఇక భారత్ నాకౌట్కు అర్హత సాధించాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా జరగని పనే అని చెప్పాలి.