ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ సీజన్లో ఇంటిముఖం పట్టిన తొలి జట్టుగా నిలిచింది. సొంత మైదానంలో వాంఖడే వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి ముంబైకి దారులు మూసుకుపోయాయి. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 24 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవరల్లో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (70; 52 బంతుల్లో, 6x4, 3x6), మనీష్ పాండే (42; 31 బంతుల్లో, 2x4, 2x6) టాప్ స్కోరర్లు. బుమ్రా (3/18), కొయెట్జీ (3/42) చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ముంబై 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ (56; 35 బంతుల్లో, 6x4, 2x6) పోరాడాడు. స్టార్క్ (4/33) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

అయితే ఈ మ్యాచ్లో ముంబై తుది జట్టులో రోహిత్కు స్థానం దక్కలేదు. ఛేజింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బ్యాటింగ్కు వచ్చాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు నుంచి రోహిత్ తప్పించడానికి గల కారణాలేంటని చర్చ మొదలైంది. జట్టులో రోహిత్ స్థానానికి ప్రమాదం ఏర్పడిందా? ఈ నిర్ణయం వెనక సూత్రదారి హార్దిక్ పాండ్యనా? ఈ లీగ్ మొత్తానికి రోహిత్ దూరం కానున్నాడా? అనే ప్రశ్నలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా రోహిత్ రావడానికి గల కారణాలను ఆ జట్టు స్పిన్నర్ పీయూష్ చావ్లా వివరించాడు. వెన్నునొప్పితో బాధ పడుతున్న హిట్మ్యాన్ను ఫీల్డింగ్కు దూరంగా ఉంచాలని భావించామని చావ్లా తెలిపాడు. 'రోహిత్ కాస్త వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతనికి విశ్రాంతి ఇచ్చాం' అని చావ్లా పేర్కొన్నాడు. ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు రోహిత్ అందుబాటులోనే ఉంటానని ఇండైరెక్ట్గా హిట్ ఇచ్చాడు.
మరోవైపు రోహిత్ తేలికపాటి నొప్పితోనే బాధపడుతున్నాడని చావ్లా స్పష్టం చేయడంతో టీమిండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రోహిత్కు తీవ్ర గాయమైతే, మెగా టోర్నీకే దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.